నిన్న సిఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కీలక సమావేశానికి కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు డుమ్మా కొట్టడం వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అధినేత సమావేశానికి వారు కూడబలుక్కొన్నట్లు డుమ్మా కొట్టడంపై మీడియాలో రకరకాల కధనాలు వస్తుండటంతో వైసీపీ నష్టానివారణకు పూనుకొని సదరు మంత్రులు, ఎమ్మెల్యేల చేతనే వివరణ ఇప్పిస్తోంది.
చాలాకాలంగా వైసీపీకి అధినేతకు దూరంగా ఉంటున్న వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ, “నాకు నిన్న పన్ను ఆపరేషన్ జరిగింది. అదీకాక ఇంట్లో ఒ ఫంక్షన్ ఉన్నందున సమావేశానికి హాజరుకాలేకపోయాను తప్ప వేరే కారణం లేదు. కానీ నేను పార్టీ మారబోతున్నానంటూ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేసింది. నేను ఎప్పటికీ జగనన్నతోనే ఉంటాను,” అని చెప్పారు.
గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీడియాతో మాట్లాడుతూ, “నేను ఐఎస్బీ పరీక్షలు వ్రాస్తున్నాను. అందుకే నిన్నటి సమావేశానికి హాజరుకాలేకపోయాను. నా గురించి ఎల్లో మీడియాలో వస్తున్న కధనాలన్నీ టిడిపి మైండ్ గేమ్స్ మాత్రమే!” అని అన్నారు.
మంత్రి ధర్మాన ప్రసాదరావు తాను ఆసరా పింఛన్ల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉన్నందున సమావేశానికి హాజరుకాలేకపోయానని చెప్పారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనకు జ్వరం వచ్చిందని చెప్పి పర్మిషన్ తీసుకొన్నారని సమాచారం. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో మిగిలినవారు ఇంకా సంజాయిషీలు ఇచ్చుకోవలసి ఉంది.
నిన్న జరిగిన సమావేశం ఏమీ అప్పటికప్పుడు అనుకోని నిర్వహించినది కాదు. వారం రోజుల ముందుగానే అందరికీ దీని గురించి తెలుసు. కనుక పన్ను ఆపరేషన్, ఆసరా చెక్కుల పంపిణీ వంటి పనులను మర్నాటికి వాయిదా వేసుకోవచ్చు. కానీ వేసుకోలేదు. అంటే సమావేశానికి హాజరుకాకుండా తప్పించుకోవడానికి చెపుతున్న కుంటిసాకులే అని అర్దమవుతోంది. కానీ ప్రతిపక్షాలు, మీడియా ప్రతీ చిన్న విషయంపై రాజకీయాలు చేస్తూ మైండ్ గేమ్స్ ఆడుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తుండటం హాస్యాస్పదంగా ఉంది.
వారందరూ మీడియాకు ఏదైనా చెప్పుకోవచ్చు కానీ తమ అధినేత కళ్ళకు గంతలు కట్టలేరు కనుక వాళ్ళు చెప్పింది అబద్ధాలే అయితే నేడో రేపో వారందరిపై ఎలాగూ జగనన్న చర్యలు తీసుకోకుండా ఉండరు కదా?అప్పుడు ఈ నొప్పులు నిజమైనవో కావో తెలుస్తుందిగా!



