అమరావతి ఉద్యమానికి 1200 రోజులు… విజయం మీదే!

Amaravati_Farmers_Agitationరాష్ట్ర విభజనతో రాజధాని లేకుండా పోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అత్యవసరంగా రాజధాని నిర్మించుకోవలసిన అవసరం ఏర్పడటంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభ్యర్ధన మేరకు అమరావతి రైతులు తమ జీవనోపాదిగా ఉన్న 36,000 ఎకరాల వ్యవసాయ భూములను ఒక్క పైసా తీసుకోకుండా ప్రభుత్వానికి అప్పగించారు.

అందుకు ఏ ప్రభుత్వామైన వారిని సన్మానించి, గౌరవిస్తుంది. కానీ ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అని నమ్మబలికిన వైసీపీ, అధికారంలోకి రాగానే మాట మార్చి మూడు రాజధానుల పాట అందుకొంది. ఏమంటే అమరావతిపై కమ్మ ముద్ర వేసి దాని వలన ఆ వర్గమే లాభపడుతుందని వితండవాదం చేస్తున్న సంగతి తెలిసిందే.

ADVERTISEMENT

వైసీపీ ప్రభుత్వం నిర్ణయాన్ని రైతులు గట్టిగా వ్యతిరేకించారు. కానీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో 1200 రోజుల క్రితం రైతులందరూ కలిసి మందడం గ్రామంలో అమరావతి కోసం ఉద్యమం మొదలుపెట్టారు. రాష్ట్ర ప్రజలందరూ అమరావతినే కోరుకొంటున్నారని తెలియజేసేందుకు, రైతులు ఓసారి బెజవాడ కనకదుర్గమ్మ గుడి వరకు, మరోసారి తిరుమలకు పాదయాత్రలు చేశారు. రాయలసీమ ప్రజలందరూ వారికి ఘనస్వాగతం పలుకుతుండగా, వైసీపీ నేతలు మాత్రం వారిని అడ్డుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ వారు విజయవంతంగా రెండుసార్లు పాదయాత్ర చేసి ఈ పోరాటం తమ కోసం కాదని రాష్ట్ర ప్రజలందరి కోసమని ఎలుగెత్తి చాటారు.

ఆ తర్వాత అదే స్పూర్తితో అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లాలో అరసవిల్లికి పాదయాత్రకి బయలుదేరినప్పుడు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అత్యంత జుగుప్సాకరంగా వ్యవహరించడం రాష్ట్ర ప్రజలందరూ చూశారు. వైసీపీ నేతల వేధింపులు, ఒత్తిళ్ళు తట్టుకోలేక అమరావతి రైతులు మద్యలో పాదయాత్ర విరమించుకొని వెనక్కు తిరిగివెళ్లిపోవలసి వచ్చింది. కానీ అంతమాత్రన్న వారు తమ పోరాటాన్ని నిలిపివేయలేదు. అదే స్పూర్తితో నేటికీ మందడంలో దీక్షలు చేస్తున్నారు.

వారికి మొదటి నుంచి టిడిపి సంఘీభావం ప్రకటిస్తూనే ఉంది. నేడూ 1200 రోజులు ఉద్యమం పూర్తిచేసిన సందర్భంగా చంద్రబాబు నాయుడు వారికి మరోసారి ట్విట్టర్‌ ద్వారా సంఘీభావం తెలిపారు. ఇంతకాలం గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్న బిజెపి కూడా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను గుర్తించి జై అమరావతి అంటూ వారికి సంఘీభావం తెలుపుతోంది. జనసేన, వామపక్షపార్టీలు కూడా అమరావతి కోసం పోరాడుతున్న రైతులకు సంఘీభావం తెలుపుతున్నారు.

చివరికి వైసీపీలో నుంచి బయటకు వచ్చిన్న ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఇద్దరూ కూడా అమరావతే రాజధానిగా ఉండాలని చెపుతున్నారు. అంటే వైసీపీలో కూడా చాలామంది అమరావతినే కోరుకొంటున్నప్పటికీ బయటపడటం లేదని స్పష్టం అవుతోంది.

రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతినే కోరకొంటున్నారనే విషయం ఈ అంశంపై రిఫరెండంగా ఇటీవల జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో స్పష్టమైంది. కనుక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కోసం, రాజధాని కోసం, కోట్లాదిమంది ఆంధ్రా ప్రజల కోసం తమ భూములిచ్చి పోరాడుతున్న అమరావతి రైతులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకొంటూ వచ్చే ఎన్నికలలో ఓట్లను ఆయుధాలుగా చేసుకొని వారిని గెలిపించుకోవడం మన అందరి బాధ్యత.

ADVERTISEMENT
Latest Stories