ఏపీలో రాజకీయాలను సమూలంగా మార్చేసిన ఘనత వైసీపిదే. మంత్రి పదవులు, ఎన్నికలలో మళ్ళీ టికెట్లు సంపాదించుకునేందుకు అధినేత భజన చేసుకుంటే పర్వాలేదు. కానీ ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు ప్రతిపక్ష నేతల వ్యక్తిగత, కుటుంబ విషయాలను ప్రస్తావిస్తూ అవహేళన చేయడం, మీడియా ముందు బూతులు తిట్టాలనే కొత్త సంప్రదాయాన్ని వైసీపియే మొదలుపెట్టింది.
అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్లపై చొక్కాలు చించుకొని సవాళ్ళు విసరడం, డాన్సులు చేయడం అనే కొత్త సంస్కృతిని ప్రవేశపెట్టిన ఘనత కూడా వైసీపిదే.
ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై అక్రమకేసులు బనాయించి పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పుతూ వేదిస్తుండటం, భౌతిక దాడులు చేయడం… ఇలా ఒకటేమిటి ఏపీ రాజకీయాలను సమూలంగా ప్రక్షాళన చేసేసి సరికొత్త పద్దతులను పరిచయం చేసింది వైసీపి.
రేపు ప్రభుత్వం మారితే అధికారంలోకి వచ్చేవారు కూడా అవే పద్దతులు పాటిస్తే అప్పుడు తమ పరిస్థితి ఏమిటనే ఆలోచన లేకుండా నిర్భయంగా తమ పద్దతులను అమలుచేస్తున్నారు వైసీపి నేతలు.
అటువంటి వారిలో మంత్రి అంబటి రాంబాబు కూడా ఒకరు. ఆయన మీడియా ముందుకు వచ్చి ఏనాడూ తన శాఖ గురించి ఒక్క ముక్క మాట్లాడలేదు కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గురించి మాత్రం అనర్గళంగా మాట్లాడుతుంటారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు రాజకీయాల నుంచి రిటైర్ కాబోతున్నారు. ఆయనతో పాటే నారా లోకేష్ కూడా. నారా లోకేష్కు రాజకీయాలలో ప్రాధమిక అర్హతే లేదు. మంత్రి అయ్యారు కానీ ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేకపోయారు. ఈ ఎన్నికల తర్వాత తండ్రీ కొడుకులు ఇద్దరూ రాజకీయాలలో మరి కనబడరు,” అని అన్నారు.
కడప నుంచి వైఎస్ షర్మిల ఎంపీగా పోటీ చేయబోతున్న వార్తాపై స్పందిస్తూ, “ఆమె ఓ జాతీయపార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు. కనుక ఎక్కడి నుంచైనా ఆమె పోటీ చేయొచ్చు. కానీ ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఓ అంతరించిపోయిన పార్టీ. గత ఎన్నికలలో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు. కనుక ఆమె ఎక్కడి నుంచి పోటీ చేసిన ఎవరికీ అభ్యంతరం లేదు,” అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
అయితే రాజకీయాలలో ప్రాధమిక అర్హత ఎమ్మెల్యే అవడమే అనుకుంటే మంచిదే. కానీ గంట, అరగంట అంటేనే ఎబ్బెట్టుగా ఉంటుంది. ఏపీ సాగునీటి శాఖ మంత్రి ఎవరు అంటే ప్రజలు చెప్పలేరు కానీ గంట, అరగంట మంత్రులు ఎవరంటే అందరూ అంటే టక్కున చెప్పేస్తారు.
ఏపీ ఐటి, పరిశ్రమల మంత్రి అంటే ఎవరికీ తెలీకపోవచ్చు కానీ ‘గుడ్డు మంత్రి’ అంటే అందరికీ తెలుసు. పర్యాటక శాఖ అంటే నెలకు నాలుగుసార్లు తిరుమల, తాడేపల్లి వెళ్ళిరావడం అనుకునే మంత్రి గురించి, మాజీ బూతుల మంత్రి గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.
కనుక ఏపీలో రాజకీయాలను మాత్రమే కాదు రాజకీయాలకు అర్హతలను కూడా మార్చేసిన ఘనత ఖచ్చితంగా వైసీపిదే. ఆ అర్హతలు తనకు లేనందున వైసీపిలో అసమర్ధుడుగా మిగిలిపోయానని బాధపడుతూ మైలవరం వైసీపి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వైసీపికి రాజీనామా చేయడం అందరికీ తెలిసిందే కదా?ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ… వడ్డించని విస్తరి ఎగిరెగిరి పడుతుందన్నట్లు దిగిపోయే వరకు వైసీపి నేతలు ఆడిందే ఆట… పాడిందే పాట… భరించక తప్పదు!




