అల్లు అర్జున్ ఓ సినిమాలో హీరోయిన్ వెంటపడుతూ ‘నా ప్రేమను కోపంగానో… నా ప్రేమను ద్వేషంగానో ఫీల్ మై లవ్…”అంటూ పాడుతాడు. హీరోయిన్ తనను కోపంతోనో, ద్వేషంతోనో తలుచుకోవడం కూడా ప్రేమే అని గొప్పగా నిర్వచించాడు.
అదేవిదంగా మంత్రి అంబటి రాంబాబు కూడా టిడిపి, దాని అనుకూల మీడియా తనను అదేవిదంగా తలుచుకొంటున్నాయని, టిడిపి మీడియాలో తనకు కొంత చోటు కేటాయిస్తున్నాయని చెప్పి అందుకు కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.
గడప గడపకి కార్యక్రమంలో భాగంగా సోమవారం పల్నాడులో రాజుపాలెంలో పర్యటించినప్పుడు సంక్షేమ పధకాల విషయంలో మహిళలు నిలదీసి శాపనార్ధాలు పెట్టారు. మీడియాలో వచ్చిన ఈ వార్తలపై మంత్రి అంబటి తనదైన శైలిలో స్పందించారు.
“నిన్న నేను నా నియోజకవర్గంలో పర్యటించినప్పుడు గడప గడపకి మహిళలు నన్ను తిట్టిపోశారని, ప్రజలు నా బెండు తీశారని టిడిపి అనుకూల మీడియా వ్రాసుకొని శునకానందం పొందింది. అయితే ఎవరూ నా బెండు తీయలేదు. నిన్న నా నియోజకవర్గంలో 375 ఇళ్ళకు వెళ్ళి అందరికీ కార్డులు, పింఛన్లు పంపిణీ చేశాను. వాటిలో ఒకటి టిడిపికి, మరొకటి జనసేనకు చెందినవారివి ఉన్నాయి.
ఆ రెండు ఇళ్ళలోవారు మాత్రమే నన్ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారు. అదికూడా… టిడిపి అనుకూల మీడియా ముందుగా అక్కడకు వెళ్ళి వారికి ట్రైనింగ్ ఇచ్చి కెమెరాలతో సిద్దంగా ఉండి, ప్లాన్ చేసి నన్ను తిట్టించారు. అదే విషయాన్ని తమ మీడియాలో ప్రధానంగా వేసుకొని శుకానందం అనుభవించారు.
కానీ నన్ను తిట్టే ప్రయత్నంలో వారి మీడియాలో నాకు చోటు కల్పించి నాకు ఉచిత పబ్లిసిటీ చేస్తున్నందుకు ఈ సందర్భంగా వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని చెప్పారు.
— Ambati Rambabu (@AmbatiRambabu) August 1, 2022



