బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇద్దరూ ఏపీకి వచ్చి జగన్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు అంతులేకుండా పోయిందని, ప్రధాని నరేంద్రమోడీ దేశాన్ని అద్భుతంగా పాలిస్తున్నారని ఆంధ్రా ప్రజలకు గుర్తుచేసి వెళ్ళిపోయారు.
పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో రెండు ముక్కలు వ్రాస్తేనే చెలరేగిపోయీ ఎదురుదాడి చేసే వైసీపీ మంత్రులు, జేపీ నడ్డా, అమిత్ షా ఇద్దరూ ఏపీకి వచ్చి తమ ప్రభుత్వంపై ఇన్ని విమర్శలు, ఆరోపణలు చేసినా ఎవరూ కిక్కురుమనలేదు. అసలు వారు వచ్చారు, తిట్టారు, వెళ్ళారనే సంగతి తమకు తెలియనట్లే సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ మౌనంగా ఉండిపోయారు. ఎందుకో అందరికీ తెలుసు.
ఆడపిల్ల పుట్టింటికి వస్తే లేదనకుండా చేతిలో ఎంతో కొంతపెట్టి సాగనంపిన్నట్లు జగనన్న ఎప్పుడు ఢిల్లీకి వచ్చి అడిగినా తృణమో పణమో చేతిలో పెట్టి పంపిస్తూనే ఉంటారు. అడగగానే కేసులకు బ్రేకులు వేయిస్తుంటారు. కనుక అమ్మ ఎన్ని తిట్లు తిట్టినా సమ్మగానే ఉంటుందన్నట్లు, నడ్డా, అమిత్ షాలు ఎన్ని తిట్లు తిట్టినా వైసీపీ నేతలు మౌనం వహించడం సహజమే.
కానీ బిజెపికి ఇటువంటి సభల వలన ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అని ఆలోచించుకోవాలి. ఎందుకంటే, వచ్చే ఎన్నికలలో ఏపీలో వైసీపీ-టిడిపి, జనసేనల మద్యనే ప్రధానంగా పోటీ జరుగబోతోంది. కనీసం జనసేనను బిజెపి నిలుపుకోలేకపోతోంది. దాంతో కలిసి పనిచేయలేకపోతోంది. ఏపీలో రెండు పార్టీల మద్య స్నేహం కొనసాగుతోందని చెప్పుకొంటున్నప్పుడు నడ్డా, అమిత్ షా సభలలో ఆ విషయం చెప్పాలి కదా? రెండు పార్టీలు కలిసి ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించాలి కదా? కానీ బిజెపి, జనసేనలు వేర్వేరుగా సభలు, వారాహి యాత్రలు చేసుకొంటున్నాయి. కనుక జనసేనతో కలిసి పనిచేయబోవడం లేదనైనా చెప్పి ఉండాలి కదా? అదీ చెప్పలేదు.
జాతీయస్థాయి నాయకులు ఓ రాష్ట్రంలో బహిరంగసభ నిర్వహించారంటే దాని వలన ఆ రాష్ట్ర పార్టీకి ఎంతో కొంత ప్రయోజనం కలగాలి. కానీ కంఠశోష తప్ప బిజెపికి ఏం ప్రయోజనం కలుగుతోందో అర్దం కాదు. అయినా ఏపీలో సభపెట్టి జగన్మోహన్ రెడ్డిని తిట్టిపోసి, ఢిల్లీలో ఆయనను కౌగలించుకొంటూ ఏపీ ప్రజలకు, ముఖ్యంగా ఏపీ బిజెపి నేతలకు ఏమి సంకేతాలు పంపిస్తున్నట్లు?



