సోషల్ మీడియాలో కన్నీళ్ళు, యుద్ధాలు వ్యర్ధం… ఓటు వేసి మార్పు తేవాలి
దేశంలో అనేకసార్లు అనేక ఎన్నికలు జరుగుతుంటాయి. మరోసారి కూడా జరుగుతున్నాయి. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు అటు రాజకీయ పార్టీలకే కాక రాష్ట్ర ప్రజలకు కూడా చాలా కీలకంగా మారాయి. రాష్ట్ర విభజనతోనే ఒకసారి తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో ప్రయోగాన్ని తట్టుకునే పరిస్థితిలో లేదిప్పుడు.
కనుక ‘మేలు’ కావాలో ‘అభివృద్ధి’ కావాలో ప్రజలే తేల్చుకోవలసిన సమయం ఇది. మేలు పొందుతున్నవారందరూ తప్పక ఓట్లు వేస్తారు. కానీ అభివృద్ధి కోరుతున్నవారు మాత్రం పోలింగ్ రోజున మరో సెలవు కలిసొచ్చిందనుకుంటే హాయిగా గడిపేస్తారు తప్ప ఓట్లు వేయాలనుకోరు. వారి ఈ వైఖరే రాష్ట్రానికి శాపంగా మారుతోంది.
రాష్ట్ర రాజకీయాలు, అన్ని సమస్యలు, అన్ని విషయాలపై పూర్తి అవగాహన ఉన్నవారు ఓట్లు వేయరు. కానీ పెద్దగా అవగాహనలేని నిరుపేదలు మాత్రం ఎండకు ఓర్చి తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకుంటారు. అందుకే వైసీపి ప్రభుత్వం వారినే ఓటు బ్యాంకుగా మార్చుకొంది.
మళ్ళీ అధికారం దక్కించుకునేందుకు వైసీపి వారికి చేస్తున్న ‘మేలు’ అంతా ఇంతా కాదు. వారికి ఆ ‘మేలు చూపిస్తూ’ వైసీపి నేతలు ఓట్లు అడుగుతుంటే, ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూసి నిత్యం సోషల్ మీడియాలో ఆవేశపడిపోయే బుద్ధిజీవులు మాత్రం తమ ఓటు హక్కుతో మార్పు తేవాలని అనుకోరు.
వారి ఒక్కరోజు బద్దకానికి వారితో సహా రాష్ట్ర ప్రజలందరూ 5 ఏళ్ళపాటు నానా బాధలు పడాలి. పెంచబోయే ఛార్జీలు, పన్నులతో సహా దౌర్జన్యాలు, అరచాకాలు అన్నీ భరించక తప్పదు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోవడం వైసీపి నేతలకు అవమానం అనిపించకపోవచ్చు. కానీ విద్యావంతులు, వైద్యులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వంటివారికి అనిపిస్తూనే ఉంది కదా?
అమరావతి రాజధాని కోసం గత నాలుగేళ్ళుగా రాజధాని రైతులు నిరవదిక ఆందోళనలు చేసినప్పుడు, విద్యావంతులు పోలింగ్ ఒక్కరోజున ఓట్లు వేసేందుకు కదిలిరాలేరా? క్రికెట్ మ్యాచ్ లేదా సంక్రాంతి పండుగ కోసమో ఎంతో వ్యయప్రయాసలకోర్చే విద్యావంతులు, పోలింగ్ రోజున ఓటు హక్కు కోసం రాకపోతే ఎలా? నిరక్షరాస్యులు, వృద్ధులు, వికలాంగులు కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకొంటునప్పుడు, విద్యావంతులు ఓట్లు వేయకపోవడం సిగ్గుచేటు కాదా?
ఓటు వేయకుండా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గురించి సోషల్ మీడియాలో ఎవరు ఎన్ని కన్నీళ్ళు కార్చినా, ఎన్ని యుద్ధాలు చేసినా వ్యర్ధం. కనుక రాష్ట్ర భవిష్యత్కు అత్యంత కీలకంగా నిలుస్తున్న ఈ ఎన్నికలలో ఓటు హక్కుగల ప్రతీ ఒక్కరూ తరలివచ్చి ఓటు వేసి అభివృద్ధిలో భాగస్వాములు కావాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో ప్రయోగాన్ని తట్టుకోలేదు కనుక! మరో ప్రయోగం చేస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి హిరోషిమా, నాగసాకి అవుతుంది. అప్పుడు ఇక ఎవరూ ఎప్పుడూ ఓట్లు వేయాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు.




