తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 1 నుంచి హైకోర్టు కార్యకలాపాలు వేర్వేరుగా ప్రారంభం కానున్నాయి. తెలంగాణకు 10 మంది, ఆంధ్రప్రదేశ్కు 16 మంది న్యాయమూర్తులను కేటాయిస్తూ కేంద్ర న్యాయ శాఖ కాసేపటి క్రితం గెజిట్ను విడుదల చేసింది. గత వారమే ఈ గెజిట్ విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ అన్ని విషయాలపైనా అధ్యయనం చేసి సంబంధిత శాఖలతో సమాలోచనలు జరిపి ఈ రోజు విడుదల చేసింది.
[m9ad]
ప్రస్తుతం ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రమేశ్ రంగనాథన్ను ఆంధ్రప్రదేశ్కు కేటాయించింది. ప్రస్తుతం ఉమ్మడి హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలంగాణ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించబోతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ హై కోర్టు ప్రస్తుతానికి హైదరాబాద్ నుండే పని చెయ్యబోతుంది. అమరావతిలోని తాత్కాలిక భవనాలు పూర్తి స్థాయిలో తయారు కావడానికి మరికొంత సమయం పట్టవచ్చు. ఈలోగా ఇక్కడ నుండే పని చెయ్యబోతుంది.
గెజిట్ విడుదల చేసిన నాటి నుండి అంటే ఈరోజు నుండి మూడు నెలల లోగా హై కోర్టు పూర్తి స్థాయిలో తరలిపోవాల్సి ఉంది. అమరావతి రాజధాని ఏరియాలో నేలపాడు గ్రామంలో హైకోర్టు కోసం తాత్కాలిక భవనాలు సిద్ధం అవుతున్నాయి. హై కోర్టు విభజనతో ఆంధ్రప్రదేశ్ విభజనలో తెలంగాణకి చెందిన డిమాండ్లు అన్నీ దాదాపుగా పూర్తి అయినట్టే. దీనితో తెలంగాణాలో సంబరాలు మిన్నంటాయి. సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఉండి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయిన రోజే గెజిట్ విడుదల కావడం విశేషం.



