ఆనాడు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అత్యంత దయనీయ పరిస్థితిలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు అయితేనే రాష్ట్రాన్ని గాడిన పెట్టగలరని గట్టిగా నమ్మి గెలిపించారు. ఆయన కూడా ప్రజల ఆకాంక్షలు, రాష్ట్ర సమస్యలు, అవసరాలను సరిగ్గా గుర్తించి చాలా చురుకుగా ఒకటొకటి పరిష్కరించారు.
చేతిలో చిల్లిగవ్వ లేనప్పుడే అమరావతి నిర్మాణం మొదలుపెట్టారు. పోలవరం ప్రాజెక్టుని పరుగులు పెట్టించారు. ఉద్యోగులకు నెలనెలా జీతాలు ఇచ్చారు. వేతన సవరణ కూడా చేశారు. రాష్ట్రానికి అనేక పరిశ్రమలను రప్పించి యువతకు ఉద్యోగాలు కల్పించారు.
కానీ కొన్ని రాజకీయ తప్పిదాల వలన, రాజకీయ శత్రువులందరూ ఏకం కావడం వలన, ప్రజలు జగన్కు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వాలనుకోవడంతో చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయారు. ఆ కధ, అప్పటి నుంచి ఈ 5 ఏళ్ళుగా జరుగుతున్న కధ రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ తెలుసు.
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, ‘రాష్ట్ర విభజన వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే ఈ 5 ఏళ్ళ జగన్ పాలనలో జరిగిన నష్టమే చాలా ఎక్కువ’నే చంద్రబాబు నాయుడు మాటలు గుర్తుకు రాకమానవు.
ఇప్పటికే రాష్ట్రంలో అప్పుల ఊబిలో కూరుకు పోయింది. రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటి కంపెనీలు రాకపోగా ఉన్నవి కూడా మూతపడుతుండటంతో ప్రతీ ఇంట్లో పిల్లలు డిగ్రీలు చేతపట్టుకొని హైదరాబాద్ లేదా బెంగళూరు వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత వారి తల్లితండ్రులు కూడా మకాం ఎత్తేసి ఇరుగు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. వెళ్ళలేకపోయినవారు ఒంటరిగా జీవిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రానైట్, ట్రాన్స్పోర్ట్, వ్యవసాయం, ఆక్వా, డెయిరీ ఇలా ఒకటేమిటి… అన్ని రంగాలు దెబ్బతిని విలవిలలాడుతున్నాయి. కానీ పట్టించుకునే నాధుడే లేడు.
రాష్ట్రానికి ఇటువంటి విషమ పరిస్థితులు వచ్చినప్పుడే అందరికీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గుర్తు వస్తారని టిడిపి నేత నారా లోకేష్ చెప్పిన మాట వాస్తవం. ఆనాడు రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి, ప్రజలకు చంద్రబాబు నాయుడు అవసరం పడిన్నట్లే ఇప్పుడు మరోసారి ఇంకా చాలా చాలా అవసరం పడిందని చెప్పవచ్చు.
కనుక ఈసారి ఎన్నికలలో ఓటర్లు ‘సంక్షేమ పధకాలతో కలిగే మేలు’ కాకుండా ‘అభివృద్ధితో కలిగే మేలు’ కలగాలని కోరుకొని చాలా ఆలోచించి ఓట్లు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాదని మళ్ళీ ‘మేలు మాయ’లో పడితే రాబోయే 5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇంకెంత దారుణంగా మారుతుందో ఎవరూ ఊహించుకోలేరు కూడా.




