ఏపీ పాలన అంతా నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి తరలి రావాల్సిందేనని చంద్రబాబు సర్కార్ జారీ చేసిన ఆదేశాలతో ఒకటి, రెండు శాఖలు మినహా మిగతావన్నీ విజయవాడ, గుంటూరు, అమరావతిలలో కొలువు తీరిన విషయం తెలిసిందే. తొలుత ఉద్యోగులు కనీస మౌలిక సదుపాయాలు లేవని మారాం చేసినా, తర్వాత వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న పనులను పరిశీలించి మీదట ఉద్యోగులు అమరావతికి రాక తప్పలేదు.
అయితే ఓ శాఖ మాత్రం వస్తానంటే… ప్రభుత్వమే వద్దని అంటోంది. అమరావతికి మేము కూడా వస్తాము అంటూ ముందుకు వచ్చిన ‘ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్’ (ఏపీపీఎస్సీ)కి మాత్రం ఏపీ సర్కార్ అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం. అమరావతికి తరలి వస్తామంటూ స్వయంగా ఏపీపీఎస్సీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ కూడా రాయగా, ఈ లేఖపై సీఎస్ ఎస్పీ టక్కర్ నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నట్లు సమాచారం. అయితే ఇది కూడా సదుద్దేశంతోనే..!
ఏపీలో నిరుద్యోగుల శాతం ఎక్కువగా ఉన్నందున…. ఈ శాఖ వచ్చినట్లయితే, నిరుద్యోగులు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నందున ప్రత్యేక భవంతి చూపించాలన్న ఏపీపీఎస్సీ అభ్యర్థనను పరిశీలించిన సీఎస్… ఇప్పుడు కాదు రెండో విడతలో ఓ ప్రత్యేక భవనాన్ని ఏర్పాటు చేస్తామని, అప్పటిదాకా కాస్తంత ఓపిక పట్టాలని చెప్పినట్లుగా సమాచారం.



