బీజేపీతో పొత్తుల కారణంగా టిడిపి, జనసేనల అభ్యర్ధుల జాబితాల ప్రకటన చాలా ఆలస్యమైనప్పటికీ, ఖరారు కాగానే టిడిపి 128 శాసనసభ నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించింది. పొత్తులో భాగంగా టిడిపికి 144 సీట్లు లభించినందున మిగిలిన 16 స్థానాలకు కూడా త్వరలోనే అభ్యర్ధులను ప్రకటించబోతోంది.
టిడిపి పోటీ చేయబోతున్న 17 ఎంపీ స్థానాలకు ఇప్పటికే చాలామంది పేర్లు ఖరారు చేసింది. అధికారికంగా వారి పేర్లు ప్రకటించవలసి ఉంది. ఈరోజు సాయంత్రం 10 మంది అభ్యర్ధులను చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించే అవకాశం ఉంది. వీరితో పాటు మరికొంతమంది శాసనసభ అభ్యర్ధులను కూడా ప్రకటించవచ్చని తెలుస్తోంది.
టిడిపి, జనసేనల పొత్తులో భాగంగా జనసేనకు 3 ఎంపీ, 24 ఎమ్మెల్యే సీట్లు దక్కగా, బీజేపీ కోసం వాటిలో ఒక ఎంపీ, 3 ఎమ్మెల్యే సీట్లు వదులుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం సీటుతో కలుపుకొని మొత్తం 15 మంది అభ్యర్ధుల పేర్లు ప్రకటించారు. ఎంపీ సీట్లకు అభ్యర్ధులను ప్రకటించవలసి ఉంది.
మూడు పార్టీల పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ, 10 ఎమ్మెల్యే సీట్లు లభించాయి. కానీ ఇంతవరకు అభ్యర్ధులను ప్రకటించలేదు. ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసింది కనుక త్వరలోనే బీజేపీ కూడా అభ్యర్ధులను ప్రకటించనుంది.
టిడిపి ఎంపీ అభ్యర్ధులుగా పోటీ చేయబోతున్న కొందరి పేర్లు:
1. నెల్లూరు: వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
2. హిందూపురం: బీకే పార్ధసారధి
3. అనంతపురం: జెసీ పవన్ రెడ్డి
4. విజయవాడ: కేశినేని చిన్ని
5. గుంటూరు: పెమ్మసాని చంద్రశేఖర్
6. నంద్యాల: బైరెడ్డి శబరి
7. నరసారావుపేట: లావు శ్రీకృష్ణదేవరాయలు
8. ఒంగోలు: మాగుంట రాఘవరెడ్డి
9. శ్రీకాకుళం: కింజారపు రామ్మోహన్ నాయుడు.




