ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో తమకున్న బంధాన్ని తెంచుకోవాలని బీజేపీ ఆలోచిస్తోందా? ‘నిత్యమూ ప్రత్యేక హోదా’ను బీజేపీ ఇవ్వడం లేదని టిడిపి మంత్రులు, నేతలు విమర్శలు గుప్పిస్తుండటంతో… దీనికి ఘాటు ప్రతి విమర్శలే సమాధానంగా పంపాలని బీజేపీ నిర్ణయించింది. ఈ రోజు విజయవాడలో రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సమావేశం ప్రారంభం కాగా, ఇక్కడకు వచ్చిన ప్రతి బీజేపీ నేత, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయగా, మరీ ముఖ్యంగా చంద్రబాబును విమర్శించడమే లక్ష్యంగా మాట్లాడారు.
విపక్ష ఎమ్మెల్యేలకు ఆకర్షించే బదులు, ప్రజలను ఆకర్షించాలని, ఫిరాయింపులపై చూపే శ్రద్ధను ధరలను అదుపు చేయడంపై చూపితే రాష్ట్రం బాగుపడుతుందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఆది నుంచి రాజకీయ అనైతిక వ్యవహారంగా ఫిరాయింపులను వ్యతిరేకిస్తున్నామని మరో నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. హోదా ఆలస్యం కావడానికి అన్ని పార్టీలూ కారణమని, తమ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి పూర్తి సాయం అందుతోందని బిజెపి తీరును సమర్ధించుకునే ప్రయత్నం చేసారు.
పలు నిధుల విషయాలలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా లెక్కలు చెప్పలేదని అన్న బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ సిద్దార్థ నాధసింగ్ వ్యాఖ్యలు చేసిన సమక్షంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి, కావూరి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నేతల వ్యవహార శైలి చూస్తుంటే, టీడీపీతో ఇక అమీతుమీ తేల్చుకునేందుకు వీరు సిద్ధపడ్డట్టు తెలుస్తోందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.



