రాజధాని లేకుండా చేసి పొట్టి శ్రీరాములుకి నివాళులా… హవ్వ!

YS Jagan Tweet

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కోసం 56 రోజులు నిరవదిక నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు 1952, డిసెంబర్‌ 15వ తేదీ అర్దరాత్రి తుదిశ్వాస విడిచారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి, వైసీపి ఎంపీ విజయ సాయిరెడ్డి తదితరులు ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ సోషల్ మీడియాలో సందేశాలు పెట్టారు.

“ఆంధ్ర రాష్ట్ర సాధ‌న కోసం ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేసి, ప్రాణాలు కోల్పోయిన మ‌హ‌నీయులు, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక శ్రీ పొట్టి శ్రీ‌రాములు గారు. త‌న ప్రాణ‌త్యాగంతో ప్ర‌త్యేక తెలుగు రాష్ట్రం ఏర్ప‌డేలా చేసి, అమ‌ర‌జీవిగా నిలిచారు. నేడు ఆయ‌న వ‌ర్థంతి సంద‌ర్భంగా ఘ‌న నివాళులు,” అని సిఎం జగన్‌ ట్వీట్ చేశారు.

ADVERTISEMENT

అయితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంటగలిపేస్తూ, మళ్ళీ ఆత్మగౌరవం గురించి, దాని కోసం పోరాడిన పొట్టి శ్రీరాములు గురించి ట్వీట్ చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా?

ఒకవేళ జగన్మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ఆత్మగౌరవం గురించి ఆలోచించి ఉండి ఉంటే అమరావతిని పాడు బెట్టి ఉండేవారు కారు. నాలుగున్నరేళ్ళుగా మూడు రాజధానులని విశాఖ రాజధాని అంటూ కాలక్షేపం చేసి ఉండేవారే కాదు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాలు, ఆంధ్రుల ఆత్మగౌరవం కంటే వైసీపి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తూ మూడు రాజధానులు, విశాఖ రాజధాని పేరుతో రాజకీయాలు చేస్తున్నారని చెప్పక తప్పదు.

రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ప్రజలే కాదు… ఇరుగు పొరుగు రాష్ట్రాలలో రాజకీయ నేతలు, ప్రజలు కూడా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిన పోయిన ఆంధ్రప్రదేశ్‌ని, అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు చెల్లించలేకపోతున్న వైసీపి ప్రభుత్వం దుస్థితిని చూసి జాలిపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఇతర రాష్ట్రాలలో తలెత్తుకొని తిరగలేకపోతున్నారు. అయినప్పటికీ ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇరుగు పొరుగు రాష్ట్రాలకు వలసలు వెళ్ళక తప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి, ప్రజలకు కూడా ఇటువంటి దుస్థితి కల్పించిన వైసీపి ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మకూడా ఘోషించేలా చేస్తోందని చెప్పక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories