కూటమి ప్రభుత్వం కేవలం పాలన సాగిస్తామంటే సరిపోదు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దాలి. వాటి వలన కలిగిన కష్టనష్టాలను భరిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. సంక్షేమ పధకాలు కూడా అమలు చేయాలి.
ఇవన్నీ చేస్తున్నాము కనుక ఇక ‘నో వర్రీస్’ అనుకుంటే కుదర్దు. కూటమిలో మూడు పార్టీల మద్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలని పసిగట్టాలి.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా అది చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే ఉండాలి. కనుక కూటమి ప్రభుత్వం వైసీపీని రాజకీయంగా వేధించడం కాదు… వైసీపీయే కూటమి ప్రభుత్వానికి రోజూ అగ్నిపరీక్షలు పెడుతోందని చెప్పుకోవచ్చు.
ఇప్పుడు డీఎస్సీలో అవకతవకలు అంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టిన ఆందోళనలతో ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం మొదలుపెట్టింది.
కనుక రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నిర్వహణ ప్రక్రియ ఏవిధంగా పారదర్శకంగా జరిగిందో తెలియజేస్తూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది.
దానిలో ముందుగా దీనిపై వైసీపీ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని ఖండించింది. డీఎస్సీ నోటిఫికేషన్ మొదలు తుది ఎంపిక వరకు టీసీఎస్ ఐఆన్ డిజిటల్ ప్లాట్ ఫామ్, 256 బిట్ ఎన్స్క్రిప్షన్, 46,000 ప్రశ్నలలో నుంచి ర్యాండమ్ సెలక్షన్ చేశామని పేర్కొంది.
పరీక్షల నిర్వహణ వరకు ఈ మొత్తం వ్యవస్థలో ఎవరూ జొరబడలేనివిధంగా సాంకేతికంగా కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు పాటించామని పేర్కొంది. కనుక ప్రశ్నా పత్రాల లీక్కి ఆస్కారం లేకుండా అత్యంత సమర్ధంగా పరీక్షలు నిర్వహించామని పేర్కొంది.
ఈ పరీక్షలపై అభ్యర్దుల పిర్యాదులు స్వీకరింఛి పరిష్కరించేందుకు గాను కూడా మూడు స్థాయిలలో పిర్యాదుల స్వీకరణ వ్యవస్థలు ఏర్పాటు చేశామని పేర్కొంది.
ఈ డీఎస్సీకి సంబంధించి మెరిట్ లిస్టులు, ఆన్సర్ కీలు, ఎంపిక ప్రక్రియకు సంబందించిన ప్రతీ దానిని అధికారిక వెబ్సైట్లో అందరికీ అందుబాటులో పెట్టి పూర్తి పారదర్శకత పాటించాలని పేర్కొంది.
ముందుగా అన్ని ఏర్పాట్లు చేసుకొని షెడ్యూల్ ప్రకటించి ఆ ప్రకారమే ప్రతీ దశని నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తూ, కేవలం 148 రోజులలోనే 16,347 మంది ఉపాధ్యాయులను భర్తీ చేసినట్లు దానిలో పేర్కొంది.
గత ప్రభుత్వం డీఎస్సీ హామీని నెరవేర్చకపోగా ఇప్పుడు ఈవిధంగా తప్పుడు ప్రచారాలు కూడా చేస్తోందని, ఈ పరీక్షలు వ్రాసి ఉద్యోగాలు సాధించినవారి పట్ల అవమానకరంగా వ్యవహరించడం సరికాదని ప్రభుత్వం పేర్కొంది.
మెగా డీఎస్సీపై ఎంత దుష్ప్రచారం జరుగుతున్నా డీఎస్సీలో ప్రతీ దశ ప్రభుత్వ రికార్డులలో నమోదై ఉందని, నేటికీ ఆ వివరాలన్నీ అందరికీ అందుబాటులోనే ఉన్నాయని ప్రభుత్వం ప్రెస్ నోట్లో పేర్కొంది.



