2024 ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లో ఒక్కో కీలక అంశంలోనూ ముందడుగు పడుతూ వస్తుంది. రాష్ట్ర రాజధాని అమరావతి పునః నిర్మాణం నుంచి మొదలుపెడితే భోగాపురం ఎయిర్ ఫోర్ట్ పూర్తి వరకు కూటమి ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు పట్టాలెక్కాయి, ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
ఆ కోవలోకే తాజగా ఎన్నో దశాబ్దాల విజయవాడ, విశాఖ వాసుల చిరకాల స్వప్నం మెట్రో ప్రాజెక్ట్ మరోసారి చర్చలోకొచ్చింది. ఈ ప్రాజెక్ట్ పై చర్చలు ఎక్కువగా కాగితపు లెక్కలే పరిమితం అయ్యేవి. కానీ ఈ సారి కేంద్ర ప్రభుత్వం ఈ రెండు ప్రాంతాల వారి మెట్రో ఆశలను నెరవేర్చేందుకు 21,616 కోట్ల అంచనా వ్యయంతో 84.63 కిమీ విస్తీర్ణంలో మెట్రో నిర్మాణాలు చేపట్టేందుకు పనులు మొదలుపెట్టింది.
ముఖ్యంగా విజయవాడ లో మెట్రో ప్రాజెక్ట్ కు సంబంధించిన ల్యాండ్ సర్వే ప్రక్రియ కూడా మొదలయ్యింది. విజయవాడ మెట్రో నిర్మాణం ఆ ఒక్క ప్రాంత అభివృద్ధికి మాత్రమే పరిమితం కాకుండా రాజధాని అమరావతి ప్రగతి కి కూడా అత్యంత కీలకంగా మారనుంది.
అయితే విజయవాడ మెట్రో నిర్మాణ పనులకు భూ సేకరణ అత్యంత కీలకంగా మారనుంది. విజయవాడ వంటి వాణిజ్య, వ్యాపార నగరంలో భూ సేకరణ అనేది ప్రభుత్వానికి అత్యంత కష్టసాధ్యమయినదే. కానీ ఒక్కసారి ప్రభుత్వం ఆ పనిని సజావుగా పూర్తి చేయగలిగితే ఇక విజయవాడ నగర వాసుల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడినట్టే, వారి దశాబ్దాల కల నెరవేరినట్టే.
అలాగే ఏపీలో ఐటీ హబ్ గా రూపాంతరం చెందుతున్న విశాఖ నగరానికి కూడా మెట్రో అత్యవసరమే. ఐటీ నగరాల అభివృద్ధిలో మెట్రో సేవలు ఎంత కీలకం అనేది హైద్రాబాద్, బెంగుళూరు మెట్రో వినియోగదారులను చూస్తే యిట్టె అర్ధమవుతుంది.
ఇప్పటికే విశాఖ ఆర్థికంగా, సామాజికంగా అభివృధి సాధించిన నగరంగా ఏపీలో ఒక మంచి గుర్తింపు పొందింది. ఇక ఆ ఉక్కు నగరానికి ఈ మెట్రో సదుపాయం కూడా అందుబాటులోకి వస్తే విశాఖ అభివృద్ధి నెక్స్ట్ లెవెల్ లోకి ఎంట్రీ అవ్వడం తధ్యం.
ఇలా ఈ రెండు నగర వాసుల మెట్రో కలలు నెరవేరడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చిత్తశుద్ధితో పాటుగా ఆయా ప్రాంతాల ప్రజల సహకారం కూడా అంతే అవసరం సుమీ…!




