ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలు ఆపడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం… ఇప్పుడు తమకు అనుకూలమైన ఉద్యోగ సంఘాల నేతలతో ఎన్నికలు వాయిదా వేయించే ప్లాన్ వేసింది.
ఇప్పటికే ప్రభుత్వం వేస్తున్న పిటిషన్లతో పాటు ఉద్యోగ సంఘాలు కూడా కోర్టులను ఆశ్రయిస్తున్నాయి. మరోవైపు.. “ఎలాగైనా ఎన్నికలు జరిపి తీరుతామనే నిమ్మగడ్డ మొండివైఖరి సరికాదు. మా ప్రాణాలకు ష్యూరిటీ ఎవరు ఇస్తారు.. నిమ్మగడ్డ గ్యారెంటీ ఇస్తారా. మమ్మల్ని భయపెట్టి చంపే అధికారం మీకు లేదు. అవసరమైతే సమ్మెకు కూడా వెనుకాడం’’ అని ఆంధ్రప్రదేశ్ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు.
అయితే ప్రభుత్వానికి సాయం చేస్తున్నాయి అనే విషయం అర్ధం అవుతూనే ఉంది. ఇక్కడ చాలా మంది ఇంకో ప్రశ్న కూడా వేస్తున్నారు. “ఎలక్షన్ డ్యూటీ చేయమంటే మా ప్రాణాలకు ఎవరు గ్యారంటీ ఇస్తారని అతి తెలివి ప్రదర్శిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రతిరోజూ ఆఫీసుకి వెళ్తున్నారు కదా మరి మీ ప్రాణాలకి ఎవరు హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి ఇచ్చారా? లేక ఛీఫ్ సెక్రటరీ ఇచ్చారా? కోవిడ్ డ్యూటీ చేస్తున్న వాళ్ళకు ఎవరు హామీ ఇచ్చారు?,” అంటూ సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నిస్తున్నారు.
“ప్రభుత్వం ఏక పక్షంగా ఉద్యోగులకు ఇచ్చే డీఏలు రద్దు చేసినా ఉద్యోగ సంఘాలు స్పందించవు. జీతాలు సమయానికి ఇవ్వకపోయినా స్పందించవు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ అధికారంలోకి వచ్చిన వారంలో రోజులలో రద్దు చేస్తాం అన్న స్పందించారు. ప్రభుత్వానికి ఇబ్బంది కలిగితే మాత్రం ఏలిన వారిని ప్రసన్నం చేసుకోవడానికి మీడియా ముందు ప్రత్యక్ష అయిపోతారు,” అంటూ ఎద్దేవా చేస్తున్నారు.





