భారత్ పట్ల అమెరికా తీరు ఎప్పుడూ ఒక్కలాగే ఉంటుంది. అవసరమైనప్పుడు భారత్ మా మిత్రదేశం. ప్రధాని మోడీ నా ఆప్తమిత్రుడు అంటూ పొగుడుతూ ఉంటారు. లేకుంటే చచ్చిపోయిన ఆర్ధిక వ్యవస్థ భారత్ది అని ఎద్దేవా చేస్తారు. రష్యా చమురు కొనుగోలు చేసినందుకు భారీగా సుంకాలు పెంచి జరిమానాలు విధించి ఆంక్షలు విధించడానికి అమెరికా వెనకాడలేదు. రష్యా నుంచి భారత్ ఆయుధాలు కొనుగోలు చేస్తే చెయ్యి మెలిపెట్టి మరీ అమెరికా నుంచి కూడా ఆయుధాలు కొనుగోలు చేయించింది. భారత్, పాక్ యుద్ధం జరుగుతున్న సమయంలో పాక్కి అత్యవసరంగా నిధులు విడుదలయ్యేలా చేసింది. ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి.
ఇంతకీ విషయం ఏమిటంటే, అమెరికా సెనేటర్ స్టీవ్ డైన్స్ తాజా ఇంటర్వ్యూలో “నేను చైనా వెళ్ళినప్పుడు నా మొబైల్ ఫోన్ అమెరికాలో వదిలి వెళ్తాను. అదే భారత్కు వస్తే వెంట తెచ్చుకుంటాను. భారత్ మా మిత్రదేశం. దానిపై మాకు పూర్తి నమ్మకం ఉంది. చైనా కూడా మా మిత్రదేశమే. కానీ బీజింగ్ని పూర్తిగా నమ్మలేము,” అని అన్నారు.
కానీ భారత్ పట్ల అమెరికా ద్వంద వైఖరి గురించి తెలిసినవారు ఇలాంటి తియ్యటి మాటలు ఎన్నడూ నమ్మరు. అమెరికాతో స్నేహం, వాణిజ్య సంబంధాలు భారత్కు చాలా అవసరమే. కనుక అంతవరకే స్నేహం సరిపోతుంది. ముఖ్యంగా ట్రంప్ వంటి వ్యక్తి అమెరికా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు అమెరికాకు భారత్ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేకుంటే కొరివితో తల గోక్కున్నట్లే అవుతుంది.






