తెలంగాణలో బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీల నేతలు అవకాశం చిక్కినప్పుడల్లా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, వారి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడానికి ఏమాత్రం వెనకాడరు. కానీ వైసీపీ అధినేత జగన్ విషయంలో వారు ఎప్పుడూ మౌనంగానే ఉంటారు. కారణం అందరికీ తెలిసిందే.
ఉదాహరణకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇటీవల తన కంటే వయసులో, అనుభవంలో చాలా పెద్దవారైన ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని ఉద్దేశ్యించి “అమరావతిలో మీ కుర్చీ కిందకు నీళ్ళు వస్తున్నాయేమో చూసుకోండి ముందు,” అంటూ వెటకారంగా మాట్లాడారు. కానీ జగన్ విషయంలో ఆమె కూడా బీఆర్ఎస్ పార్టీ వైఖరిని ఫాలో అవుతూ మౌనం పాటిస్తుంటారు.
ఇంతకీ విషయం ఏమిటంటే, జగన్ మళ్ళీ అమరావతిని వ్యతిరేకిస్తూ ‘మావిగన్’ రాజధాని అంటే ఏపీలో దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ ఎప్పటిలాగే ఇప్పుడు కూడా బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీలు, అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మౌనం పాటిస్తున్నారు.
అయితే వారి మౌనం కొత్తేమీ కాదు. గతంలో జగన్ మూడు రాజధానులు, ఆ తర్వాత విశాఖ రాజధాని అంటూ రకరకాల ప్రతిపాదనలు చేసినప్పుడు ఇలాగే మౌనం వహించారు. రాజధాని విషయంలో అనిశ్చితి తెలంగాణకు భారీగా కలిసి రావడమే వారి మౌనానికి కారణమని అందరికీ తెలుసు. ఏపీకి రావాల్సిన పరిశ్రమలు, పెట్టుబడులు హైదరాబాద్కు తరలిపోయాయి.
ఒకవేళ జగన్ మళ్ళీ ఏపీ సిఎం అయ్యి, మావిగన్తో కాలక్షేపం చేస్తూ తెలంగాణకు లబ్ది కలుగజేస్తారని తెలిసి ఉన్నప్పుడు ఎవరైనా ఎందుకు వద్దంటారు? ఇప్పుడూ అందుకే మౌనం వహిస్తున్నారనుకోవచ్చు.
కానీ జగన్ కల, తెలంగాణ నాయకుల ఈ లెక్కలు ఫలిస్తాయా? లేక ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి రాజధాని విషయంలో స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారా? ఇస్తే వైసీపీ దాని అధినేత జగన్ పరిస్థితి ఏమిటి? అయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న తెలంగాణ నేతల పరిస్థితి ఏమిటి?






