వచ్చే ఎన్నికల పరిస్థితి ఏమిటి? కేంద్రంలో మళ్ళీ మోడీ నేతృత్వంలో ఎన్డీయే అధికారంలోకి వస్తుందా? లేక ఈసారి కాంగ్రెస్ కూటమిని గద్దెనిక్కిస్తారా? రెండు తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి ఏమిటి?అనే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది.
అయితే లోక్సభ ఎన్నికలు, రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికలకు, ఫలితాలకు ఓ అదృశ్య సంబంధం ఉందనేది బహిరంగ రహస్యం.
వరుసగా మూడుసార్లు ప్రధాని మోడీ పాలన చూసిన దేశ ప్రజలు, మార్పు కోరుకోవడం సహజం. కానీ ప్రధాని మోడీ, ఎన్డీయే కూటమి, బిజేపికి ప్రత్యామ్నాయ శక్తిగా నిలవాల్సిన రాహుల్ గాంధీ, ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నందున, దేశ ప్రజలు మళ్ళీ ప్రధాని మోడీకే మొగ్గు చూపవచ్చు.
కేంద్రంలో మళ్ళీ ఎన్డీయే వస్తుందని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు భావిస్తే వారి ఎంపిక కూడా అందుకు అనుగుణంగానే ఉంటుంది.
ముఖ్యంగా ఆంధ్రాలో ‘డబుల్ ఇంజన్ సర్కార్’ చేస్తున్న అభివృద్ధి పనులను, నేటికీ వైసీపీ విధ్వంసకర ఆలోచనలను కళ్ళార చూస్తున్న ప్రజలు మళ్ళీ కూటమికే మొగ్గు చూపడం ఖాయం.
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలనతో వేసారి పోయారని, మళ్ళీ కేసీఆర్ని కోరుకుంటున్నారనే కేటీఆర్ వాదనని పూర్తిగా కొట్టిపడేయలేము.
కానీ రేవంత్ పాలన ఏవిధంగా ఉన్నప్పటికీ అయన ఎన్నికల వ్యూహాలు అమోఘం. కనుక రెండు పార్టీలకు సమానావకాశాలు ఉన్నాయనుకోవచ్చు.
అయితే ఈసారి తెలంగాణపై బిజేపి గురి పెట్టింది. కనుక రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే, అయన బిజేపి చేతికి మట్టి అంటనీయకుండా కేసులతో బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచగలరు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని పక్కకు లాగేయడం బిజేపికి పెద్ద పని కాదు.
ఇలాంటి ప్రమాదం పొంచి ఉందని కేసీఆర్కు బాగా తెలుసు. కనుక ఈసారి ఆయన బిజేపితో చేతులు కలిపి ‘సేఫ్ గేమ్’ ఆడినా ఆశ్చర్యం లేదు.
తెలంగాణ ప్రజలు కూడా ఈసారి బిజేపికి ఓ అవకాశం ఇద్దామనుకోవచ్చు. కనుక ఏవిధంగా చూసినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం పొంచి ఉందనిపిస్తుంది.
అయితే ఈసారి కూడా తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2028 డిసెంబర్లో.. అంటే ఏపీలో ఎన్నికల కంటే ఆరు నెలల ముందుగా జరిగితే, తెలంగాణ ఫలితాల ప్రభావం కూడా ఏపీ ఎన్నికలపై పడవచ్చు.
ఒకవేళ రేవంత్ రెడ్డి లేదా బిజేపి వస్తే కూటమికి ఇబ్బంది ఉండదు. కానీ కేసీఆర్ వస్తే అయన తప్పకుండా మళ్ళీ జగన్ని సిఎం కుర్చీలో కూర్చోపెట్టే ప్రయత్నం చేస్తారు. కనుక కేంద్రంలో, తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందదనేది కూడా ఏపీకి కీలకమే.
ఒకవేళ రేవంత్ రెడ్డి చెపుతున్నట్లు తెలంగాణ శాసనసభ ఎన్నికలు కూడా 2029లో సార్వత్రిక ఎన్నికలతో కలిపి నిర్వహిస్తే, మళ్ళీ ఈ లెక్కలన్నీ మారిపోతాయి.





