ఇటీవల జనసేన పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వచ్చే ఎన్నికలలో జనసేన 50-60 స్థానాల నుంచి పోటీ చేస్తుందన్నారు.
ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ సమయం ఉండగా ఇప్పటి నుంచి ఇటువంటి మాటలు మాట్లాడటం తొందరపాటు లేదా రాజకీయ అపరిపక్వతగా కనిపిస్తుంది.
కానీ ఇది జనసేన పార్టీలో రగులుతున్న అసంతృప్తికి సంకేతంగా కూడా చూడవచ్చు. అంతే కాదు.. జనసేనని రెచ్చగొట్టి కూటమిలో చిచ్చు రగిలించి విచ్చినం చేయాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలకు ఊతం ఇస్తున్నట్లే ఉంది.
కూటమి ప్రభుత్వం బలంగా, స్థిరంగా ఉన్నందునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండేళ్ళలో ఇంత అభివృద్ధి సాధించగలిగింది. కనుక కూటమి ఐఖ్యతకు భంగం కలిగించే ఏ చిన్న ఆలోచన, మాట, ప్రయత్నం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాలిట శాపంగా మారుతుందని జనసేన నేతలు, కార్యకర్తలు గ్రహించాలి.
విశాఖలో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ నేతలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, వచ్చే ఎన్నికలలో 50, 60, 120 సీట్లలో పోటీ చేస్తామంటూ మాట్లాడవద్దని సున్నితంగా హెచ్చరించారు. ఓ రాజకీయ పార్టీగా మనమూ ఓపికగా, బాధ్యతగా వ్యవహరించాలి తప్ప దుందుడుకుగా వ్యవహరించరాదని హితవు పలికారు.
అయితే సోషల్ మీడియాలో కొంత మంది నాదెండ్ల మాటలను తప్పు పడుతూ కామెంట్స్ చేస్తున్నారు. జనసేన ఎప్పటికీ టీడీపికి తోక పార్టీగానే మిగిలిపోవాలా? జనసేన కార్యకర్తల మనోభావాలను పట్టించుకోరా?కనీసం 30 శాతం సీట్లు పొందకపోతే జనసేన ఉండి ఏం ప్రయోజనం?అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఈ సందర్భంగా కొంత కాలం క్రితం పవన్ కళ్యాణ్ స్వయంగా అన్నమాట ఓసారి గుర్తు చేసుకోవడం అవసరం. “నా శ్రేయోభిలాషులమని చెప్పుకుంటున్నవారు జనసేన ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఎక్కడున్నారు?కనీసం నన్ను కూడా గెలిపించలేకపోయారు కదా?
పార్టీని ఏవిధంగా నడిపించాలో నాకు బాగా తెలుసు. పార్టీ ప్రయోజనాలు మాత్రమే కాదు … రాష్ట్ర ప్రయోజనాలు కూడా నాకు ముఖ్యం. తదనుగుణంగానే నా నిర్ణయాలు ఉంటాయి. పార్టీలో ఉండాలనుకున్నవారు నా నిర్ణయాలను శిరసావహించాల్సిందే,” అని చాలా స్పష్టంగా చెప్పారు.
అయినా పార్టీలో కొందరు నేతల తీరు మారలేదు. ఇటువంటి మాటలతో కూటమి ఐఖ్యత దెబ్బ తింటే, అందరూ నష్టపోతామని గ్రహించడం లేదు.
జనసేన కూడా టీడీపి, వైసీపీలలాగే ఓ రాజకీయ పార్టీ. కనుక సొంతంగా పోటీ చేసే గెలిచి అధికారంలోకి రావాలనుకోవడం తప్పు కాదు.
కానీ గత అనుభవాలను, పార్టీ ప్రస్తుత పరిస్థితిని, నేతల బలాబలాలను అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఆచితూచి మాట్లాడటం, అడుగులు వేయడం చాలా అవసరం. పవన్ కళ్యాణ్ అదే చేస్తున్నారు కదా?
కానీ తమ అధినేత ఆలోచనలను అర్థం చేసుకోకుండా, ఆయన మాటకు విలువీయకుండా, వైసీపీ రెచ్చగొడుతుంటే దాని ఉచ్చులో చిక్కుకొని ఇలాంటి మాటలు మాట్లాడుతూ టీడీపిపై కత్తులు దూయడం అంటే కూర్చొన్న కొమ్మని నరుక్కోవడమే. జగన్ ఆవిధంగా చేసినందుకే ప్రజలు వైసీపీకి రెండో ఛాన్స్ ఇవ్వనప్పుడు, మనకి ఇస్తారా? అని ప్రతీ ఒక్కరూ ఆలోచించాలి.





