రాజకీయాలలో అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శ – ప్రతివిమర్శ అనేది సర్వ సాధారణమైన అంశం. అయితే అవన్నీ రాజకీయ విమర్శలకే పరిమితమైతే దానిని హుందాతనం అంటారు. అలాకాకుండా ఆ విమర్శలు వ్యక్తిగతానికి సంబందించినవైతే వాటిని అహంకారంతో కూడిన విమర్శలు కిందే పరిగణించాల్సి ఉంటుంది.
అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేసీఆర్, రేవంత్ పోటాపోటీగా ఒకరి మీద మరొకరు పోటీపడి మరి విమర్శలు చేసుకున్నారు.అదంతా కూడా రాజకీయంలో భాగమే. అయితే ప్రజల తీర్పుతో ముఖ్యమంత్రి పదవి అధిరోహించిన రేవంత్ మాజీ ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ కు జరిగిన ప్రమాదం పై స్పందించిన తీరు ఏపీ రాజకీయాలు సిగ్గు పడేలా చేసాయి.
నిన్నటిదాకా విమర్శలతో కత్తులు దూసుకున్న ప్రత్యర్థులు ఇప్పుడు ఒకరు కష్టంలో ఉన్నారంటే అక్కడే చస్తాడు, ఎప్పుడు చేస్తాడో, ఖర్మ ఫలితం అనుభవిస్తున్నాడు,ఇదే దేవుని స్క్రిప్ట్ అంటూ పుండు మీద కారం చల్లే వ్యాఖ్యలు చేయకుండా ముఖ్యమంత్రిగా ఆ పదవికి ఉన్న హుందాతనాన్ని తగ్గించకుండా రేవంత్ కేసీఆర్ ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ప్రభుత్వం తరుపున చేయాల్సిన చర్యలన్నీ చేస్తున్నారు.
కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు రేవంత్ తన X లో స్పందించారు. అలాగే ఆసుపత్రి వద్ద భద్ర పెంచి ఆర్యోగ శాఖ అధికారులను పరిస్థితిని సమీక్షించమని ఆదేశించారు. ఇదే రాజకీయాలలో ఆ వ్యక్తికీ, ఆ పదవికి గౌరవం తెచ్చేది. తెలంగాణ రాజకీయాలు చూసిన ఏపీ ప్రజలు ఇప్పుడు ఏపీ రాజకీయ పరిస్థితులను విశ్లేషించుకుని సిగ్గుపడుతున్నారు.
ఏపీలో స్కిల్ కేసులో అరెస్టయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో చంద్రబాబు పట్ల, ఆయన ఆరోగ్యం పట్ల, ఆయన కుటుంబం పట్ల కూడా వైసీపీ నాయకులు చేసిన దిగజారుడు వ్యాఖ్యలు గుర్తుచేసుకుంటున్న ఏపీ ప్రజలు హుందాతనానికి – అహంకారానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఇప్పుడు స్పష్టంగా కనపడుతుందని నోరెళ్లబెడుతున్నారు.
ప్రత్యర్థి కష్టంలో ఉంటే ఆయన చావుని కోరుకున్న నాయకులు ఒకపక్క ఉంటే అదే ప్రత్యర్థి కష్టంలో ఉంటే కష్టానికి అండగా ఉంటూ సానుభూతి తెలిపిన నాయకులు మరో పక్క. ఇప్పటికైనా రాజకీయాలలో పట్టు విడుపులు ఉండాలి అదే రాజకీయ ధర్మం అనేది వైసీపీ నాయకులు గ్రహించాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు.




