తన రాజకీయ ప్రస్థానానికి తల్లి, చెల్లి ఎవరడ్డొచ్చినా జగన్ ఏ మాత్రం ఉపేక్షించే పరిస్థితి లేనట్లుగా కనపడుతోంది. తల్లిని విదేశాలకు పంపించి వేస్తున్నట్లుగా వార్తలు వచ్చి 24 గంటలు గడవక ముందే, జగన్ చెల్లి షర్మిల సభలోకి వైసీపీ ఆగంతకులు ప్రవేశించి అలజడి సృష్టించడం ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది.
వైఎస్ వివేకాను హత్య చేసిన అవినాష్ రెడ్డిని గత అయిదేళ్లుగా కాపాడుతూ వస్తోన్న జగన్ ను తూర్పారపడుతూ సాగుతోన్న షర్మిల – సునీతల రాజకీయ ఉపన్యాసంలోకి నేడు వైసీపీ దుండగులు ప్రవేశించడం కలకలం రేపింది. జగన్ మరోసారి తన పులివెందుల మార్క్ రాజకీయాలను రుచిచూపించారంటూ ప్రముఖ మీడియా వర్గాలు హాట్ కేకుల్లా ప్రసారం చేస్తున్నాయి.
గత నాలుగేళ్లుగా ప్రతిపక్ష నేతలు నిర్మాణాత్మక విమర్శలు చేసినా వారికీ ఇవే పరిస్థితులు ఎదురుకాగా, నేడు సొంత సోదరీమణుల పైన కూడా అదే తరహా రాజకీయ దాడులు జరిగేలా ప్రేరేపించడం ఊహించదగినది కాదు. షర్మిల – సునీతలు చేస్తోన్న విమర్శల వెనుక చంద్రబాబు ఉన్నారని చెప్తూ వస్తోన్న జగన్, ఈ దాడుల వెనుక కూడా చంద్రబాబే ఉన్నారని అంటారేమో?!
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ అభ్యర్థులు బరిలోకి దిగకుండా దాడులు నిర్వహించి, భయబ్రాంతులకు గురిచేసిన ‘జగన్ అండ్ కో’ నేటి సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ అదే తరహా దాడులకు శ్రీకారం చుట్టినట్లుగా కనపడుతోంది. ఇవన్నీ గమనిస్తోన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం ముక్కున వేలేసుకోవడం ప్రస్తుతం తప్ప ఏం చేయలేని పరిస్థితి. అంతా మే 13వ తేదీ కోసం వెయిటింగ్..!




