బాలయ్య చిన్న పిల్లలాంటి వాడు… రాజకీయాలకు సరిగా పని చేయడు… అన్న మాటలు ఎప్పుడూ వినిపించేవి. అయితే, ఈ హిందూపూర్ ఎమ్మెల్యే ‘చాప క్రింద నీరు’లా మారుతున్నారని వర్తమాన రాజకీయ పరిస్థితులు చెప్తున్నాయి. ప్రస్తుతం ఏపీని కుదిపేస్తున్న భూమా నాగిరెడ్డి వ్యవహారంలో బాలకృష్ణ కీ రోల్ పోషించారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
వైసీపీలో జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న భూమా ఒక్కసారిగా ప్లేట్ మార్చడానికి ఉన్న బలమైన కారణం బాలయ్య బాబు అంటే బహుశా టిడిపి వర్గాలకు కూడా నమ్మశక్యం కావడం లేదు. ఎస్సీ అట్రాసిటీ కేసులో నెల రోజుల పాటు జైలులో ఉన్న భూమా నాగిరెడ్డికి ‘పవర్’ రుచి చూసిన భూమాకు ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో కూర్చోవడం కంటే, అధికార పక్షంలో ఉండడం ఎంత ఉత్తమమో తెలిసే విధంగా భూమా నాగిరెడ్డిని ఒప్పించడంలో బాలకృష్ణ సక్సెస్ అయ్యాడని కామెంట్స్ వినిబడుతున్నాయి.
తాజాగా ఈ విషయంలో టిడిపి కర్నూల్ జిల్లా నేతలతో భేటీ అయిన చంద్రబాబు, భూమా నాగిరెడ్డి చేరికపై నిర్ణయాన్ని తనకు వదిలేయమని సూచించినట్లుగా తెలుస్తోంది. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా తాను చూసుకుంటానని, పార్టీని పటిష్టపరిచేందుకు ఇలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఆ స్వేచ్ఛ తనకివ్వాలని చంద్రబాబు పార్టీ నేతలతో చెప్పినట్లుగా శిల్పా బ్రదర్స్ అన్నారు.





