సచీ దర్శకత్వంలో రూపొందిన `అయ్యప్పనుమ్ కోషియుమ్` మలయాళంలో సంచలన విజయం సాధించింది. ఇందులో పృథ్వీరాజ్, బీజు మీనన్ కీలక పాత్రల్లో నటించారు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ హీరోగా నటించాడు. ఈ చిత్ర రీమేక్ రైట్స్ని సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవరనాగవంశీ దక్కించుకున్నారని ఇప్పటికే తెలిసిందే.
ఈ సినిమాలో ఒక హీరో పాత్రకు నందమూరి బాలకృష్ణని, మరో హీరో పాత్ర కోసం రానాని అనుకుంటున్నట్టు మొన్న ఆ మధ్య వార్తలు వచ్చాయి. బాలయ్యకు ఈ కథను వినిపించారని, అయితే ఆయన కాదని అన్నారని సమాచారం. దీనికి కారణం ఆ సినిమా ఫస్ట్ హాఫ్ అని అంటున్నారు. బాలయ్యకు అది నచ్చలేదని, అయితే కథ ప్రకారం ఆయన ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చెయ్యలేమని నిర్మాతలు అంటున్నారు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరు అనేదాని మీద క్లారిటీ లేదు. మొన్న ఆ మధ్య త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని వార్తలు వస్తున్నాయి. అల వైకుంఠపురములో సక్సెస్ తో ఊపు మీద ఉన్న త్రివిక్రమ్ తన తరువాతి సినిమా ఎన్టీఆర్ తో చెయ్యబోతున్నాడు.
కరోనా వైరస్ లొక్డౌన్ వల్ల ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఆలస్యం అవుతుంది. ఆ సినిమా సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశం లేదని కూడా అంటున్నారు. అదే జరిగితే త్రివిక్రమ్ సమ్మర్ వరకూ ఖాళీనే. ఆలోగా అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఆ ప్రకారంగా త్రివిక్రమ్ తో సినిమా చేసే అవకాశం బాలయ్య వదులుకుంటున్నట్టు అయ్యింది.





