జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడటంతో కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ మధ్య ఆయన హైదరాబాద్ లోనే మకాం వేసి ఇక్కడి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్పై మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు.
హైదరాబాద్లో వరద ప్రభావిత ప్రాంతాల సందర్శనకు వెళ్లిన ఆయన.. తన పర్యటన సందర్భంగా స్థానిక అధికారులెవరూ అందుబాటులో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్కు ఫోన్ చేసి నిరసన వ్యక్తం చేశారు. ఒక కేంద్ర మంత్రి పర్యటనకు కనీసం తహసిల్దార్ వచ్చే స్థాయి కూడా లేదా అని నిలదీశారు.
అవసరం లేదంటే.. ఢిల్లీ వెళ్తాను కదా అంటూ మండిపడ్డారు. అయితే నగరంలో కనీవినీ ఎరుగని వర్షాల వల్ల జనజీవితం అస్తవ్యస్తం అయ్యింది. రెండు రోజులుగా కరెంటు లేని ఏరియాలు ఇంకా ఉన్నాయి. చాలా ప్రాంతాలలో ఇంకా నీరు నిలిచే ఉంది. ఆయా ప్రాంతాలలో ప్రజలు నిలువనీడ లేకుండా ఉన్నారు. ఇలాంటి విపత్తులో మంత్రిగారు ఫోటోల కోసం పర్యటనలు చేస్తే [ప్రజలకు ఏం ఉపయోగం?
పైగా అధికారులు పనులు అన్నీ మానుకుని ఆయన కూడా ఉండాలంటే ఎక్కడ కుదురుతుంది? రెండు రోజులుగా అధికారులు తిండి నిద్ర లేకుండా శ్రమిస్తున్నారు వారికి కొంత కో-ఆపరేట్ చేస్తే అందరికీ మంచిది. ఈ సమాయంలో ఇటువంటి పర్యటనలు పెట్టుకోకపోవడమే మంత్రులు ప్రజలకు చేసే అతిపెద్ద సాయం.




