వైసీపి కండువాలు వేసుకొని డ్యూటీ చేస్తే అంతే మరి!

Bonda Umamaheswara Rao

కేంద్ర ఎన్నికల కమీషన్‌ ఏపీ ఇంటలిజన్స్ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ నగర పోలీస్ కమీషనర్‌గా క్రాంతి రాణా ఇద్దరిపై వేటు వేసింది. వారిద్దరినీ తక్షణం ఎన్నికల విధుల నుంచి తప్పించి దూరంగా ఉంచాలని ఆదేశించింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలలోగా వారి స్థానాలలో ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున ఆరుగురు అధికారుల పేర్లు సూచించాలని సిఎస్ జవహర్ రెడ్డిని కేంద్ర ఎన్నికల కమీషన్‌ ఆదేశించింది.

ADVERTISEMENT

దీనిపై టిడిపి నేత, విజయవాడ సెంట్రల్ అభ్యర్ధి బోండా ఉమా స్పందిస్తూ, “రాష్ట్రంలో కొంత మంది పోలీస్ ఉన్నతాధికారులు వైసీపి కండువాలు వేసుకోలేదు కానీ వైసీపి నేతలకు ఏమాత్రం తీసిపోకుండా పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు అధికారులు నన్ను గులక రాయి కేసులో ఇరికించి అరెస్ట్ చేయాలని ప్రయత్నించారు.

నేటికీ విజయవాడ సెంట్రల్ ఏసీపీ, సీఐలు వైసీపి అభ్యర్ధి వెల్లంపల్లి శ్రీనివాస్ కనుసన్నలలోనే పనిచేస్తున్నారు. కనుక ఇప్పటికైనా వారందరూ వైసీపి కండువాలు తీసి పోలీస్ అధికారులుగా వ్యవహరిస్తే వారికే మంచిది. రాష్ట్రంలో ప్రతీ ఒక్క పోలీస్ అధికారి ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమీషన్‌ ఆధీనంలోనే పనిచేయాలి తప్ప రేపు దిగిపోబోయే జగన్‌ ప్రభుత్వం కనుసన్నలలో కాదని గ్రహిస్తే వారికే మంచిది.

మే 1వ తేదీ దగ్గర పడుతోంది. అలాగే పోలింగ్ తేదీ (మే 13) కూడా దగ్గర పడుతోంది. కనుక సెర్ఫ్ సీఈవో మళ్ళీ పింఛన్లు ఆలస్యం చేయించవచ్చు. ఈసీ ఆయనను కూడా ఈ విదుల నుంచి తప్పించి పింఛన్‌దారులకు 1వ తేదీన పింఛన్లు అందేలా ఏర్పాట్లు చేయాలి,” అని బోండా ఉమా విజ్ఞప్తి చేశారు.

అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తే ఏమవుతుందో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్‌ కేసులలో అరెస్ట్ అవుతున్న పోలీస్ అధికారులను చూస్తే అర్దమవుతుంది. అంతే కాదు… అధికార పార్టీ కోసం తప్పుగా వ్యవహరించి కేసులలో ఇరుకుంటే వారిని వాడుకున్న ఏ రాజకీయ నాయకుడు కాపాడేందుకు ముందుకు రారు.

కేసీఆర్‌ తాజా ఇంటర్వ్యూలో ఫోన్ ట్యాపింగ్‌ కేసులతో ముఖ్యమంత్రికి, మంత్రులకు ఎటువంటి సంబందమూ ఉండదని, వారి తప్పొప్పులకు వారే బాధ్యత వహించాలని చెప్పడమే ఇందుకు నిదర్శనం. కనుక మిగిలిన ఈ నెలరోజులు అధికారులందరూ నిష్పక్షపాతంగా పనిచేయాలని బోండా ఉమా సూచనను పాటిస్తే వారికే మంచిది.

ADVERTISEMENT
Latest Stories