వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి మొదలు ఆ పార్టీలో నేతలందరూ వితండ వాదనలు చేస్తుంటారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాటలు వింటే అది అర్దమవుతుంది.
ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు వాలంటీర్లపై ఎన్నికల సంఘానికి పిర్యాదులు చేయించి వారు పింఛన్లు ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు వారికి పింఛన్ ఎలా అందుతుంది? మేము డీఏస్సీ నోటిఫికేషన్ ఇస్తే పరీక్ష జరుగకుండా అడ్డుకొని నిరుద్యోగులకు నష్టం కలిగిస్తున్నారు.
వేరే జిల్లాకు చెందిన పెత్తందారులను ఇక్కడకు తీసుకువచ్చి పోటీ చేయించడం ఉత్తరాంధ్రా పట్ల చులకనభావం ప్రదర్శించడమే కదా?వారు ఉత్తరాంధ్రాలో ప్రశాంతమైన వాతావరణం కూడా చెడగొడతారు. జగన్ బీసీలకు ఎక్కువ టికెట్స్ ఇస్తే, టిడిపి, జనసేన, బీజేపీ మూడూ ఓసీలకే ఇచ్చుకున్నాయి.
మంత్రినైనా నాకే సెక్యూరిటీ లేదు. కానీ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇద్దరూ భయపడి జెడ్ కేటగిరీ భద్రత కల్పించుకున్నారు. ఈ ఎన్నికలలో ఓడిపోతే తమకేమి జరుగుతుందో అనే భయంతోనే బీజేపీతో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నారు.
కానీ ఆయన ఏం చేసినా సంక్షేమ పధకాలతో లబ్ధి పొందిన ప్రజలు మళ్ళీ వైసీపీనే గెలిపించబోతున్నారు. జగనే మళ్ళీ సిఎం అవుతారు,” అని అన్నారు.
ప్రభుత్వాలు ఎప్పటి నుంచో పింఛన్లు ఇస్తూనే ఉన్నాయి. వాటినే జగన్ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా అందజేస్తోంది. అయితే అది ప్రజలపై ప్రేమ కారిపోతుండటం వలన కాదు… లబ్ధిదారులను వైసీపి ఓటర్లు మార్చేందుకు ప్రయత్నించేందుకే. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో పింఛన్లు జమా చేయకుండా వాలంటీర్ల ద్వారా ప్రజల చేతిలో డబ్బు పెట్టిస్తుండటానికి కారణం ఇదే కదా?
ఓట్ల కోసమే ‘మేలు’ అని జగన్తో సహా వైసీపిలో అందరూ చెప్పుకుంటూన్నారు కదా? వాలంటీర్ల ద్వారా ప్రజలను ప్రలోభ పెట్టి ఓట్లు దండుకోవాలని వైసీపి ప్రయత్నిస్తున్నప్పుడు, టిడిపి అడ్డుకోవడంలో తప్పేముంది?వాలంటీర్లు లేనపుడు అందరూ ఎలా పింఛన్లు తీసుకున్నారో అలాగే ఇప్పుడూ తీసుకుంటారు.
ఐదేళ్ళ పాలనలో డీఎస్సీ తీయాలని ప్రతిపక్షాలు, నిరుద్యోగులు ఎంతగా మొత్తుకున్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే ఇటువంటి పరీక్షలు నిలిచిపోతాయని కూడా జగన్ ప్రభుత్వానికి తెలుసు. కానీ నిరుద్యోగుల ఓట్లు కూడా దండుకునేందుకే జగన్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు డీఎస్సీ ప్రకటించిందని అందరికీ తెలుసు.
ఇతర జిల్లాల నేతలను వేరే జిల్లాలో పోటీ చేయిస్తున్న పార్టీలలో వైసీపి అగ్రస్థానంలో ఉంది. వైసీపి అభ్యర్ధుల జాబితా చూస్తే ఇది అర్దమవుతుంది.
ఇక నారా లోకేష్కు కేంద్రం జెడ్ కేటగిరీ రక్షణ కల్పించడం జగన్ ప్రభుత్వానికి అవమానం కాదా?అంటే ఓ ప్రధాన ప్రతిపక్ష నాయకుడుకి రాష్ట్రంలో రక్షణ లేదనే కదా దానార్దం? అందుకు బొత్స సత్యనారాయణ సిగ్గుపడకపోగా తిరిగి ప్రశ్నిస్తుండటం ఇంకా సిగ్గుచేటు.
ఒకవేళ టిడిపి ఓడిపోతే ఏమి జరుగుతుందో అని చంద్రబాబు నాయుడు భయపడుతున్నట్లయితే అసలు ఎన్నికలలో పోటీ చేసేవారే కారు కదా?అయినా టిడిపి ఓడిపోతే చంద్రబాబు నాయుడుకి ఏదో ప్రమాదం పొంచి ఉందన్నట్లు బొత్స సత్యనారాయణ చెప్పడాన్ని ఏమనుకోవాలి?రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలకు జెడ్ కేటగిరీ భద్రత అవసరం పడుతోందంటే అర్దం ఏమిటి?ఎవరిని చూసి వారు భయపడుతున్నారు?అని ప్రశ్నించుకుంటే బొత్స సత్యనారాయణ ఈవిదంగా మాట్లాడి ఉండేవారే కారు కదా?




