ఇది ఎన్నికల వేళ కనుక మీడియా ప్రతినిధులు ఎన్నికల వ్యూహానిపుణుడు ప్రశాంత్ కిషోర్ వెంటపడుతూనే ఉన్నారు. ఇటీవల ఆయన పిటిఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో వైసీపి మళ్ళీ అధికారంలోకి రాలేకపోవచ్చునని అన్నారు. జగన్ రాష్ట్రాభివృద్ధిని విస్మరించి సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకు డబ్బులు పంచిపెట్టి మళ్ళీ అధికారంలోకి రావాలనుకోవడమే ఇందుకు కారణమని అన్నారు.
ఇదివరకు ఛత్తీస్ఘడ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ కూడా జగన్లాగే రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోకుండా ప్రజలకు పధకాలతో డబ్బులు పంచిపెట్టి ఎన్నికలలో ఓడిపోయారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను అర్దం చేసుకోవడంలో జగన్ పూర్తిగా విఫలం అయ్యారని అందువల్ల ఈసారి ఎన్నికలలో ఓటమి అనివార్యమే అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
ఆయన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ, “గతంలో ఆయన మా కోసం పనిచేశారు. ఇప్పుడు వేరే ఎవరి కోసమో పనిచేస్తున్నట్లున్నారు. వారితో ‘ప్యాకేజ్’ మాట్లాడుకొన్నందునే ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారు. కనుక ఆయన కూడా ప్యాకేజీ స్టారుగా మారిపోయారు. ఇలా ఎవరో ఒకరి దగ్గర డబ్బు తీసుకొని మాట్లాడే ఇటువంటివారి మాటలకు వీలువేమి ఉంటుంది?” అని అన్నారు.
గత ఎన్నికలలో వైసీపితో ప్యాకేజీ మాట్లాడుకొని ఆ పార్టీని గెలిపించినప్పుడు ప్రశాంత్ కిషోర్ను ప్యాకేజీ స్టార్ అని బొత్సతో సహా వైసీపిలో ఎవరూ అనుకోలేదు. పైగా జగన్ ముఖ్యమంత్రి కల నెరవేర్చినందుకు అందరూ కలిసి ఆయనను ఘనంగా సన్మానించి పంపారు కూడా.
అదే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏపీలో వైసీపి వాస్తవ పరిస్థితిని తెలియజేస్తే, మళ్ళీ మేమే గెలుస్తామనే భ్రమలో మునిగి తేలుతున్న వైసీపి నేతలకు ఆగ్రహం కలగడం సహజమే. అయినా చెల్లి షర్మిలనే అవసరం తీరాక బయటకు పంపేసినప్పుడు, తమ వద్ద పనిచేసి వెళ్ళిపోయిన ప్రశాంత్ కిషోర్ మాట్లాడితే వైసీపి నేతలు సహిస్తారని అనుకోలేము కదా?




