చట్ట సభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరాహారదీక్ష చేస్తున్నారు. ఈ దీక్షలో మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, భారత్ జాగృతి సభ్యులు, వివిద పార్టీలకు చెందిన మహిళా నేతలు పాల్గొన్నారు. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి వచ్చి కల్వకుంట్ల కవిత దీక్షకు మద్దతు పలికారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “అన్ని రంగాలలో పురుషులతో పోటీపడుతూ మహిళలు దూసుకుపోతుంటే ఒక్క రాజకీయాలలో మాత్రం ఇంకా రిజర్వేషన్ల కోసం ఇలా పోరాటాలు చేయవలసివస్తోంది. చట్ట సభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని 27 ఏళ్ళ క్రితం అనుకొన్నప్పటికీ ఇంతవరకు కల్పించలేకపోయారు. కనుక ఇకనైనా పార్లమెంటులో దీని కోసం బిల్లుని ప్రవేశపెట్టాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మీరు బిల్లు ప్రవేశపెడితే పార్లమెంటులో అన్ని పార్టీలు మీకు మద్దతు ఇస్తాయి. మహిళలకు చట్ట సభలలో 33% రిజర్వేషన్లు కల్పించేవరకు మా పోరాటం ఆగదు,” అని అన్నారు.
మహిళలకు చట్ట సభలలో 33% రిజర్వేషన్లు కల్పించడం చాలా అవసరమే. అయితే కల్వకుంట్ల కవిత పోరాటంలో నిజాయితీ, నిబద్దత ఉందా?అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే తెలంగాణలో టిఆర్ఎస్ మొదటిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు దానిలో ఒక్క మహిళామంత్రి కూడా లేరు. ప్రతిపక్షాలు విమర్శించినా కేసీఆర్ పట్టించుకోలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఇద్దరికీ మాత్రమే అవకాశం ఇచ్చారు. బిఆర్ఎస్ పార్టీలో కేవలం నలుగురు మహిళా ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఒక్క ఎంపీ మాత్రమే ఉన్నారు.
మహిళలకు రిజర్వేషన్లు కేటాయిస్తేనే టికెట్ ఇవ్వాలనే నిబందన ఎక్కడా లేదు. కేసీఆర్ తలుచుకొంటే మహిళలకు టికెట్స్ ఇచ్చి ప్రోత్సహించవచ్చు. దేశంలో మిగిలిన పార్టీలు కూడా మహిళలకు టికెట్స్ ఈయవచ్చు. కానీ ఎన్నికలు, అధికారం, పదవులు అన్నీ ఓ రాజకీయ వ్యాపారంగా మారిపోయినందున గెలుపు గుర్రాలకే అన్ని పార్టీలు అవకాశం ఇస్తుంటాయి. కొమ్ములు తిరిగిన పురుష అభ్యర్ధులైతే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్ని పార్టీలు వారికే ప్రాధాన్యం ఇస్తుంటాయి.
ఉదాహరణకు మునుగోడు ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్ధి పాల్వాయి స్రవంతిని నిలబెడితే, కేసీఆర్ మాత్రం కుసులకుంట్ల ప్రభాకర్ రెడ్డిని బరిలో దింపారు. ఎందుకంటే ఆయనైతేనే కొమ్ములు తిరిగిన బిజెపి అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించగలరనే నమ్మకంతో!
కనుక కేసీఆరే ఇలా లెక్కలు కట్టుకొని అభ్యర్ధులను బరిలో దించుతున్నప్పుడు, చట్ట సభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత ఢిల్లీలో దీక్ష చేస్తుండటాన్ని ఎలా నమ్మగలం?
కేసీఆర్ బహుశః ఆమెను కూడా జాతీయ రాజకీయాలలో ప్రమోట్ చేసేందుకే ఢిల్లీలో ఈ దీక్ష చేయిస్తుండవచ్చు లేదా మహిళా హక్కుల కోసం పోరాడుతున్న తనను మోడీ సర్కార్ అన్యాయంగా లిక్కర్ కేసులో ఇరికించిందని చెప్పుకొనేందుకు కావచ్చు లేదా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ నుంచి నోటీసులు అందుకొన్నందున రాష్ట్ర ప్రజల దృష్టిని దానిపై నుంచి మళ్లించేందుకు కావచ్చు లేదా ఈ అంశంతో మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కావచ్చు తప్ప నిజంగా మహిళా రిజర్వేషన్ల కొరకు మాత్రం కాదని చెప్పవచ్చు.



