కారు సర్వీసింగ్ నుంచి తిరిగి వస్తుందో… రాదో?

BRS KCR

తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌ బహుశః ఇంతవరకు ఎన్నడూ ఇంత నైరాశ్యంలో లేరనే చెప్పొచ్చు. సుమారు 14 ఏళ్ళపాటు తెలంగాణ ఉద్యమాలలో అనేక సమస్యలు, ఎదురు దెబ్బలు తిన్నా తన లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించలేదు.

తెలంగాణ ఏర్పడి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత పదేళ్ళపాటు నా మాటే శాసనం అన్నట్లు సాగించారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీ రాజకీయాలను వైసీపితో మలుపు తిప్పారు. ఒకానొక సమయంలో దేశ రాజకీయాలను కూడా కేసీఆర్‌ శాశించగలనని అనుకున్నారు.

ADVERTISEMENT

ఇంతటి శక్తివంతమైన నాయకుడు ఒకే ఒక్క ఓటమి తర్వాత పూర్తిగా చతికిలపడిపోతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. మొదట శస్త్ర చికిత్స ఆయనను కొంత క్రుంగదీసింది. దానిని కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘బఫర్ పీరియడ్’గా చక్కగా ఉపయోగించుకొని కేవలం రెండు నెలల వ్యవధిలో అధికారంలో స్థిరపడింది.

అంతవరకు కేసీఆర్‌ హయాంలో జరిగిన అవినీతి గురించి మాత్రమే రాష్ట్ర ప్రజలకు తెలిసేది. కానీ అభివృద్ధి పేరుతో కేసీఆర్‌ చేసిన అప్పులు, ఆ పేరుతో రాష్ట్రంలో జరిగిన అనేక అవకతవకలను గణాంకాలు, శ్వేతపత్రాలు, సాక్ష్యాధారాలతో సహా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం బయటపెట్టడంతో తెలంగాణలో కేసీఆర్‌, బిఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట మరింత మసకబారింది.

శాసనసభ బడ్జెట్‌ సమావేశాలకు వచ్చి మమ్మల్ని ఎదుర్కోవాలంటూ రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ మంత్రులు పదేపదే సవాలు చేస్తున్నా కేసీఆర్‌ మొహం చాటేయడంతో కేసీఆర్‌ గురించి తెలంగాణ ప్రజలు గొప్పగా ఊహించుకున్నవన్నీ వాస్తవం కాదని స్వయంగా చాటింపు వేసుకున్నట్లయింది.

ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నా కేసీఆర్‌ ఉలూకూ పలుకూ లేదు. బిఆర్ఎస్ పార్టీలో ఎటువంటి హడావుడి కనబడక పోవడం చూస్తే ఎన్నికలకు ముందే ఓటమికి సిద్దమైపోయిన్నట్లుంది.

బీజేపీతో పొత్తులంటూ బిఆర్ఎస్ నేతలు ఇచ్చిన లీకులు ఇవ్వడం ఆ పార్టీ కొంపముంచింది. ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందిస్తూ, “ఎవరైనా బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు పొత్తు అంటే చెప్పు తీసుకు కొట్టండి,” అంటూ తనదైన శైలిలో ఘాటుగా బదులివ్వగా, బీజేపీ అధిష్టానం ఈ లీకులపై సానుకూలంగా స్పందించకపోగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితని సోమవారం ఢిల్లీలో విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ చేత నోటీస్ పంపించడం మరో పెద్ద షాక్!

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల గురించి ఆలోచించలేకపోతున్న కేసీఆర్‌, ఇక మహారాష్ట్రలో పోటీ చేయడం గురించి ఎలా ఆలోచించగలరు?

కేసీఆర్‌ ఈవిదంగా నైరాశ్యంలో కూరుకుపోతుంటే, ఆయన కుమారుడు కేటీఆర్‌ మాత్రం “కారు సర్వీసింగ్‌కు వెళ్ళింది… త్వరలోనే గ్యారేజి నుంచి తిరిగి వస్తుంది… అప్పుడు రెట్టింపు స్పీడుతో దూసుకుపోతుంది.. అంతవరకు ఓపిక పట్టండి,” అంటూ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్న నేతలని బ్రతిమలాడుకుంటున్నారు.

కానీ గ్యారేజికి చేరిన కారు మళ్ళీ ఎప్పటికైనా తిరిగి వస్తుందా? సిఎం రేవంత్‌ రెడ్డి, ప్రధాని నరేంద్రమోడీ బయటకు రానిస్తారా లేదో?

ADVERTISEMENT
Latest Stories