కుప్పం, పులివెందుల రెండు రాయలసీమకు చెందిన ప్రాంతాలే. కుప్పం చిత్తూరు జిల్లా కాగా పులివెందుల కడప జిల్లా. అయితే ఈ రెండు ప్రాంతాలలో ఒకటి కుప్పం ప్రతిపక్ష నేత చంద్రబాబు కు కంచుకోట కాగా రెండు పులివెందుల వైస్సార్ కుటుంబానికి పుట్టినిల్లు.
అయితే ఈ రెండు ప్రాంతాల మీద తమ ఆధిపత్యాన్ని సాధించాలని టీడీపీ, వైసీపీ ఎన్నో సంవత్సరాల నుండి అలుపెరుగని పోరాటం చేస్తూ చివరికి ఓటమిని అంగీకరిస్తున్నాయి. అయితే ఈసారి జరగబోయే ఎన్నికలలో వై నాట్ 175 నినాదంతో వస్తున్న వైసీపీ కుప్పంలో బాబు ని ఓడించబోతున్నాం అంటూ ప్రగల్బాలు పలుకుతుంది.
అలాగే కుప్పం వాస్తవ్యులు కూడా గతం కంటే భారీ మెజారిటీతో ఈసారి బాబు ని గెలిపించి తీరుతాం అంటూ శపధాలు చేస్తున్నారు. వైసీపీ అతి విశ్వాసానికి టీడీపీ ఆత్మవిశ్వాసానికి కారణం లేకపోలేదు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన స్థానిక ఎన్నికలలో కుప్పం లో వైసీపీ జెండా ఎగరడం వైసీపీ అతివిశ్వాసానికి కారణంగా చెప్పుకుంటే, వ్యవస్థలను మ్యానేజ్ చేసి తమకున్న అధికార బలంతో స్థానిక సంస్థల ఎన్నికలో వైసీపీ గెలిచిందని ఇప్పుడా పరిస్థితి లేదని ధీమాలో ఆత్మవిశ్వాసంగా ఉన్నారు కుప్పం వాసులు.
దీనికి తోడు వైసీపీ సర్కార్ బాబు పట్ల వ్యవహరించిన తీరు రాష్ట్రవ్యాప్తంగా బాబు పట్ల సానుభూతిని తీసుకువచ్చింది. బాబు పై కక్షతోనే జగన్ బాబుని జైలు పంపారని, వయస్సుకు, అనుభవానికి కూడా విలువనివ్వకుండా బాబు పైన ఆయన భార్య భువనేశ్వరి పైన వైసీపీ నేతలు చేసిన దిగజారుడు వ్యాఖ్యల పట్ల ఆగ్రహంలో, ఆవేశంలో బాబు మద్దతుదారులు కుప్పంలో ఫ్యాన్ రెక్కలు విరవబోతున్నారు అంటూ టీడీపీ నేతలు బాబు మెజారిటీ మీద ద్రుష్టి సాలించారు.
అలాగే పులివెందుల విషయానికి వస్తే ఈ ప్రాంతం వైస్సార్ కుటుంబానికి పుట్టినిల్లు. తన తండ్రి వైస్ రాజశేఖర్ దగ్గర నుండి ఇప్పుడు జగన్ వరకు ఈ ప్రాంతంలో వైస్ కుటుంబీకులే గెలుపు గుర్రం అధిరోహిస్తున్నారు. ఇక్కడ ప్రత్యర్థి పార్టీ గెలవడం అంటే జగన్ మెజారిటీని తగ్గించడమనే భావించాలి. పులివెందులలో జగన్ కు ప్రత్యర్థిగా టీడీపీ నుండి బిటెక్ రవి పోటీకి సై అంటున్నారు.
గతంలో టీడీపీ నుంచి సతీష్ కుమార్ రెడ్డి వైస్ కుటుంబానికి ప్రత్యర్థిగా నిలబడేవారు. ఈయన 2004 నుంచి 2019 వరకు వైస్ కుటుంబానికి వ్యతిరేకంగా టీడీపీ తరుపున తన పోరాటాన్ని కొనసాగించారు. అయితే ఇందులో 2019 మినహా ప్రతిసారి టీడీపీ తన ఓటు శాతాన్ని పెంచుకుంటూ పోతుంది. ఈసారి అన్న జగన్ కు వ్యతిరేకంగా సునీత, షర్మిల పోరాటానికి దిగడం, వివేకా హత్య కేసు, అవినాష్ రెడ్డి పై వస్తున్న ఆరోపణలతో పులివెందులలో జగన్ మెజారిటీ తగ్గే అవకాశం ఎక్కువగాఉంది అంటూ ప్రచారం జరుగుతుంది.
అయితే కుప్పంలో వైసీపీ జెండా ఎగిరే స్వేచ్ఛ ఉంది కానీ పులివెందులలో వైస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి తప్ప మరొకరికి అవకాశం లేదనేది వైస్ వివేకా విషయంలో రుజువయ్యింది. ఇక్కడ వారి జెండా తప్ప మరో జెండా ఎగరాలి అన్న ఆలోచన కూడా రానంత నియంత పాలన నడుస్తుందని వార్తలు ప్రచారంలో ఉంటాయి. ప్రత్యర్థి పార్టీలు కూడా వీటినే బలపరుస్తాయి. దీని బట్టి కుప్పం vs పులివెందుల అంటే ‘స్వేచ్ఛ vs నియంతృత్వమా’..?




