ముల్లుని ముల్లుతో తీయడం అంటే ఇదేగా…

Clarity Arrives On TDP's Pending Seats

వాలంటీర్లతో పింఛన్ల చెల్లింపు విషయంలో ఈసీ ఆదేశాలను వక్రీకరించి టిడిపి దాని అధినేత చంద్రబాబు నాయుడుని రాజకీయంగా దెబ్బ తీయాలని వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి, ఆయన పార్టీ నేతలు, వారి మీడియా ఎంతగా ప్రయత్నించాయో అందరూ చూశారు.

తాము వాలంటీర్ల ద్వారా అవ్వాతాతలకు వారి ఇంటివద్దనే నెలనెలా పింఛన్లు అందజేస్తుంటే చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారని, ఆయన కారణంగా పింఛన్లు తీసుకునేందుకు సచివాలయాలకు వెళ్ళిన 33 మంది వృద్ధులు ఎండలు తాళలేక చనిపోయారంటూ చాలా దుష్ప్రచారం చేశారు.

ADVERTISEMENT

టిడిపి గెలిచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే వాలంటీర్లను ఉద్యోగాలలో నుంచి తొలగించేస్తారంటూ వారిని కూడా భయపెట్టారు. కనుక తాను మళ్ళీ ముఖ్యమంత్రి కాగానే తొలి సంతకం వాలంటీర్ల నియామకాల ఫైలుపైనే పెడతానని కూడా జగన్మోహన్‌ రెడ్డి గొప్పగా ప్రకటించారు.

కానీ అంతకంటే ముందు వైసీపి నేతలే వాలంటీర్లపై ఒత్తిడి చేస్తూ రాజీనామాలు చేయిస్తున్నారనే విషయం ఎక్కడా చెప్పుకోవడం లేదు!

మొత్తం మీద టిడిపిని, చంద్రబాబు నాయుడుని ఈ వాలంటీర్లు, పింఛనుదారులతో ఎన్నికలలో దెబ్బతీయాలని జగన్‌ ప్రభుత్వం పెద్ద వ్యూహమే పన్నిందని అర్దమవుతూనే ఉంది.

ఈ ‘చిన్న పిల్లోడికే’ ఇన్ని తెలివితేటలు ఉంటే, నాలుగున్నర దశాబ్ధాలుగా రాజకీయాలలో ఉంటూ, మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసి, ఎన్ని ఆటుపోటులు వచ్చినా టిడిపిని చెల్లాచెదురు కాకుండా కాపాడుకొని మళ్ళీ జగన్మోహన్‌ రెడ్డికే ముచ్చెమటలు పట్టిస్తున్న చంద్రబాబు నాయుడుకి ఇంకెన్ని తెలివితేటలు ఉండాలి?

అందుకే చంద్రబాబు నాయుడు ముల్లుని ముల్లుతోనే తీయాలన్నట్లు వాలంటీర్లతో రాజకీయ చదరంగం ఆడుతున్న జగన్మోహన్‌ రెడ్డిని వారితోనే ఎదుర్కొంటూ బ్రహ్మాస్త్రం సందించారు.

ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఓ కీలక ప్రకటన చేశారు. “మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లను ఎవరినీ ఉద్యోగాలలో నుంచి తొలగించము. వారికి జగన్‌ ప్రభుత్వం ఇస్తున్న రూ.5,000 జీతానికి మరో రూ.5,000 కలిపి నెలకు రూ.10,000 జీతాలు ఇస్తాము.

కనుక వాలంటీర్లు ఎవరూ వైసీపి నేతల ఒత్తిళ్ళకు, బెదిరింపులకు భయపడి ఉద్యోగాలకు రాజీనామాలు చేయొద్దు. ఈసీ నియమనిబంధనలను ఎవరూ ఉల్లంఘించవద్దు. ఒక్క నెలరోజులు ఓపిక పడితే మీ జీవితాలకు మా సంకీర్ణ ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తుంది,” అని చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

బహుశః జగన్మోహన్‌ రెడ్డి, వైసీపి మేధావులు ఎవరూ కూడా ఇది ఊహించి ఉండరు కనుక వారందరికీ ఇది చాలా పెద్ద షాక్ అనే చెప్పాలి.

ఎందుకంటే, సంక్షేమ పధకాలతో ప్రజలకు దగ్గరైన వాలంటీర్లనే వైసీపి నేతలు నమ్ముకున్నారు. కానీ ఈసీ ఆంక్షల కారణంగా వారందరూ ఈ ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంటే, ఈ వాలంటీర్ వ్యవస్థతో ఆశించిన ప్రయోజనం దక్కకుండా పోతుంది. కనుక వారికి నయన్నో భయన్నో నచ్చజెప్పి వారి చేత రాజీనామాలు చేయించి వాడుకుందామని వైసీపి మేధావులు ఎత్తువేశారు.

కానీ చంద్రబాబు నాయుడు ‘వాలంటీర్లు ఎవరూ ఉద్యోగాలు మానేయవద్దు… తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి నెలకు రూ.10,000 జీతాలు ఇస్తామని’ ప్రకటించారు.

దీంతో వాలంటీర్లు రాజీనామాలు చేయకపోవచ్చు. చేయకపోతే వైసీపి ప్రచారంలో పాల్గొన(లే)రు. పోలింగ్ ఏజంట్స్‌గా పనిచేయ(లే)రు. అంటే వాలంటీర్లు వైసీపికి ఎన్నికలలో ఏవిదంగానూ ఉపయోగపడకపోగా చంద్రబాబు నాయుడు నేడు చేసిన ఈ ఒక్క ప్రకటనతో అందరూ టిడిపి, జనసేన, బీజేపీలకు అనుకూలంగా మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. మరోవిదంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు వైసీపి కళ్ళను వారి వేలితోనే పొడుచుకునేలా చేశారని చెప్పవచ్చు.

ఇప్పుడు వాలంటీర్లు నిర్ణయించుకోవలసి ఉంది ఏ గట్టున ఉంటారో?ఓడిపోబోయే జగన్‌ వైపా లేదా గెలిచి నెలకు రూ.10,000 జీతాలు ఇస్తామని హామీ ఇస్తున్న చంద్రబాబు నాయుడు వైపా?

ADVERTISEMENT
Latest Stories