వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ రైటర్ మారిన్నట్లున్నారు. అందుకే గత కొంతకాలంగా జగన్ తన ప్రసంగాలలో కురుక్షేత్రం, పద్మవ్యూహం, అర్జునుడు, అభిమన్యుడు అంటూ హిందూ పురాణాల గురించి మాట్లాడుతున్నారు. అయితే వాటి గురించి ఆయనకు అవగాహన లేకపోవచ్చు కానీ స్క్రిప్ట్ రైటర్లకు పూర్తి అవగాహన ఉండాలి కదా?
పశుపతి అంటే పశువు వంటివాడని స్క్రిప్ట్ రైటర్స్ అనుకొని ఉండవచ్చు. కానీ పశుపతి అంటే శివుడు అని వారికే తెలియనప్పుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎలా తెలుస్తుంది? అందుకే బుధవారం ‘మేమందరం సిద్ధం’ సభలో జగన్మోహన్ రెడ్డి వారు వ్రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని చంద్రబాబు నాయుడుని పశుపతి అంటూ ఎద్దేవా చేశారు.
ఆయన ఆజ్ఞానానికి జనాలు నవ్వుకుంటుంటే చంద్రబాబు నాయుడుని పశుపతి అని తిట్టినందుకు నవ్వుతున్నారని జగన్ సంతోషపడ్డారు.
కోనసీమ జిల్లాలో ప్రజాగళం సభలలో పాల్గొంటున్న చంద్రబాబు నాయుడు ఈవిషయం తెలుసుకొని “జగన్మోహన్ రెడ్డి తెలిసో తెలియకో నిన్న నా గురించి ఓ మంచి మాట అన్నారు. యస్ నేను పశుపతినే… మానవాళిని కాపాడేందుకు పరమశివుడు గరళాన్ని గొంతులో పెట్టుకొన్నాడు. రాష్ట్ర ప్రజల కోసం నేను అనేక అవమానాలు, సవాళ్ళు, సమస్యలను అన్నీ దిగమింగి రాక్షస పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేందుకు మీ అందరి తరపున నేను పోరాడుతున్నాను,” అని అన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కొన్ని ఆసక్తికరమైన అంశాలు ప్రస్తావించారు.
· జగన్మోహన్ రెడ్డి 2014 ఎన్నికలలో తండ్రి వైఎస్ఆర్ మరణంతో రాజకీయాలు చేశారు. 2019 ఎన్నికలలో బాబాయ్ వివేకానందరెడ్డి హత్యతో రాజకీయాలు చేశారు. ఇప్పుడు 2024 ఎన్నికలలో రాష్ట్రంలో లక్షలాది వృద్ధుల జీవితాలతో రాజకీయాలు చేస్తున్నాడు.
· వివేకానంద రెడ్డి హంతకులు ఎవరో అందరికీ తెలుసన్నావు కదా? మరైతే ఎవరో ఎందుకు చెప్పవు? హంతకులు ఎవరో చెప్పి ప్రజలను ఓట్లు అడగాలి.
· నీ పార్టీకి తగిన ఎన్నికల గుర్తు గొడ్డలే. ఆ గుర్తుతోనే ఎన్నికలలో పోటీ చేస్తే బాగుంటుంది.
· జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై బ్లేడ్ బ్యాచ్లను ఉసిగొల్పుతున్నది ఎవరు? ఆయనపై బ్లేడ్ బ్యాచ్లు దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?
· రావులపాలెంలో ఎక్కడ చూసినా గంజాయి వాసనే. మరి మీ ప్రభుత్వం, పోలీసులు ఏం చేస్తున్నారు? యువతకు గంజాయి అలవాటు చేయడానికి కారణం ఏమిటి?కొత్తపేట వైసీపి ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గంజాయి వ్యాపారం చేస్తున్నారు.
· రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలుచేస్తానని చెప్పి 5 ఏళ్ళు అవుతోంది. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అధిక ధరలకు కల్తీ మద్యం అమ్ముకుంటున్నావు.
· రాష్ట్రంలో ఇసుక, లిక్కర్, మైనింగ్ మాఫీయాలన్నిటినీ మేము అధికారంలోకి రాగానే ఉక్కుపాదంతో అణచివేసి, జగన్తో సహా మాఫీయాల చేత తిన్నదంతా కక్కిస్తాను.
· నువ్వు బటన్ నొక్కి ప్రజలకు మేలు చేస్తున్నానని గొప్పలు చెప్పుకొంటున్నావు. కానీ ప్రధాని నరేంద్రమోడీ యావత్ దేశానికి లక్షల కోట్లు నిధులు విడుదల చేస్తున్నా ఏనాడూ బటన్ నొక్కానని చెప్పుకోలేదు. ఆయన ముందు జగన్
నువ్వు బచ్ఛావే కదా?
· వైసీపి ఫ్యాన్ అరిగిపోయి తిరగడం మానేసి చాలా కాలమే అయ్యింది. ప్రజలు ఈసారి దానిని ఊడదీసి తుక్కులో పడేయబోతున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తమ కూటమి అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తామో ప్రజలకు వివరించి, మళ్ళీ మరోసారి జగన్మోహన్ రెడ్డిని నెత్తినపెట్టుకొని మరో 5 ఏళ్ళు కష్టాలు పడవద్దని హితవు పలికారు.




