టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం విజయనగరం ప్రజాగళం సభలో జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.
“ఈ ముఖ్యమంత్రి ప్రతీరోజూ ఎన్నికల ప్రచారంలో నేను, నా పార్టీ అభ్యర్ధులు అందరం చాలా పేదవాళ్ళమని, తనకు మీడియా లేదని అబద్ధాలు చెపుతుంటారు. కానీ గత ఎన్నికల సమయంలోనే ఆయనకు రూ.529.87 కోట్లు ఆస్తులున్నాయి.
ఈ 5 ఏళ్లలో జగన్, భారతి, వారి కుమార్తెల ఆస్తుల విలువ భారీగా పెరిగింది. జగన్, భారతి ఇద్దరికీ కలిపి రూ.706.50 కోట్లు అని అఫిడవిట్లో పేర్కొన్నారు. కానీ ఆదాయపన్ను శాఖకు సమర్పించిన పత్రాలలో ఇద్దరికీ కలిపి ఇంతకు పది రెట్లు ఎక్కువగా ఆస్తులున్నట్లు పేర్కొన్నారు.
ఇన్ని వేలకోట్లు ఆస్తులున్న జగన్ సతీమణి చేతిలో కేవలం రూ.10,022, పెద్ద కూతురు హర్షిణి వద్ద కేవలం రూ.9,000, చిన్న కూతురు వర్శిత వద్ద కేవలం రూ.6,989 మాత్రమే ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. జగన్ ప్రజలనే కాదు… ఎన్నికల సంఘాన్ని, ఆదాయ పన్ను శాఖని కూడా బోర్లా కొట్టించాలని ప్రయత్నిస్తున్నారు.
చివరికి తన సొంత చెల్లి వైఎస్ షర్మిలకు తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకుండా ఆమెకు అప్పు ఇచ్చిన్నట్లు చూపడం ఇంకా దారుణం,” అని చంద్రబాబు నాయుడు విమర్శించారు.
జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మెగాస్టార్ చిరంజీవిని విమర్శించడంపై కూడా స్పందిస్తూ, “సినిమాలలో చిరంజీవి మెగాస్టార్. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాలలో కూడా తన సత్తా చాటుకున్నారు. ఆయన గొప్పదనం గురించి నేను మీకు వివరించక్కర లేదు. అందరికీ తెలుసు.
ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ అవార్డుతో సన్మానించింది. అటువంటి గొప్ప వ్యక్తి చిరంజీవిని ఉద్దేశ్యించి సజ్జల రామకృష్ణా రెడ్డి నోటికొచ్చిన్నట్లు మాట్లాడారు. ఒకప్పుడు సాక్షిలో గుమాస్తా సజ్జల. ఆయనకు చిరంజీవి గురించి మాట్లాడే అర్హత కూడా లేదు.
తెలుగు ప్రజలందరూ గర్వించదగ్గ చిరంజీవి తదితర సినీ ప్రముఖులను జగన్మోహన్ రెడ్డి కూడా ఏవిదంగా అవమానించారో అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా జగన్ రెడ్డిని గట్టిగా నిలదీసి ప్రశ్నిస్తుండటంతో ఆయన గురించి కూడా చాలా అవహేళనగా మాట్లాడుతున్నారు. ఇటువంటి నీచ రాజకీయ నాయకులు మనకి అవసరమా?” అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.




