ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను ఉద్దేశిస్తూ వైసీపీ ప్రభుత్వానికి వెటకారంతో కూడిన కౌంటర్ ఇచ్చారు.
5 ఏళ్లుగా 5 కోట్లమంది రాష్ట్ర ప్రజలు ఎదురు చూసింది ఈ రోజు కోసమే…ఎన్నికల షెడ్యూల్ వచ్చింది…ఇక జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది…ఇక పోలింగ్ మిగిలింది. ‘ఒక ఛాన్స్ ప్రభుత్వానికి ఇక నో ఛాన్స్’…అని ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ప్రజాగళం వినిపించే రోజు వచ్చింది…అంటూ బాబు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
ఇన్నాళ్ళుగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా, ఒక్క సోషల్ మీడియా పోస్ట్ పెట్టినా, ఒక్క విమర్శ చేసినా, ప్రభుత్వ విధానాల పై ఒక్క ప్రశ్న వేసినా వారి పై కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలుకు పంపేవారు. దీనితో వైసీపీ ప్రభుత్వంలో అసలు ప్రజాస్వామ్యానికి విలువే లేదంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు, ఎందరో ప్రజాస్వామ్యవాదులు గొంతెత్తి రోదించినా ఫలితం లేకపోయింది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన స్థానిక ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలో ఎన్నడూ జరగని హింసా పరిణామాలు అనేకం చోటు చేసుకున్నాయి. ప్రతిపక్ష పార్టీల నుండి నామినేషన్ కూడా వెయ్యనీయకుండా అభ్యర్థులను అడ్డుకున్న ఘటనలు కోకొల్లలు అనే చెప్పాలి.
స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార వైసీపీ నాయకులు చేసిన విధ్వంసాల ఫలితంగా రాష్ట్రంలో తలలు పగిలిన విపక్ష పార్టీల కార్యకర్తల వ్యధలకు ఆ పార్టీ జెండాలే సజీవ సాక్ష్యాలుగా మిగిలిన సంఘటనలు ఎన్నో. వారి బాధలకు, ఆవేదనలు నేటితో ముగింపు పలికినట్టే అంటున్నారు టీడీపీ శ్రేణులు.
ఇక మే 13 తో వచ్చే ఎన్నికల ప్రజా తీర్పుతో వైసీపీ ఓటమి సిద్ధం….ప్రజలు జగన్ కి ఇచ్చిన ‘ఒక్క ఛాన్స్ విధ్వంసానికి ఇక నో ఛాన్స్’ అనేలా బాబు చేసిన పోస్టు టీడీపీ క్యాడర్ కు ఒక నమ్మకం వైసీపీ బాధిత కుటుంబాలకు ఒక భరోసా ఇవ్వనుంది. గత ప్రభుత్వ హయాంలో ఈసీ ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ తో మొదలైన జగన్ అరాచకాలు…ఈ నాటి ఈసీ నోటిఫికేషన్ తో ముగియనున్నాయి అనేలా…బాబు పెట్టిన పోస్టు ని వైరల్ చేస్తున్నారు టీడీపీ శ్రేణులు.
అలాగే ‘రావాలి జగన్..కావాలి జగన్..మన జగన్’ అనే వైసీపీ నినాదాన్ని మార్చేస్తూ…’రావాలి నోటిఫికేషన్…కావాలి ఎన్నికలు…మన ఏపీ’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఈసీ విడుదలకా చేసిన ఎన్నికల నోటిఫికేషన్ తో ఎవరి సంగతి ఎలా ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీల నేతలకు మాత్రం రెక్కలు వచ్చినట్టే అని చెప్పవచ్చు.




