గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన కార్యక్రమాల్లో ‘జన్మభూమి’ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రతి వారాంతంలో ప్రభుత్వ ఉద్యోగుల నుండి చదువుకునే విద్యార్ధుల వరకు ‘జన్మభూమి’ ద్వారా ‘క్లీన్ అండ్ గ్రీన్’ను ప్రణాళికా బద్ధంగా అమలు చేసారు. దీనినే పేరు మార్పుతో ఒక రకంగా ప్రధాని మోడీ ‘స్వచ్చ్ భారత్’ పేరుతో అమలు చేస్తున్నారు. అంతటి ప్రాధాన్యత దక్కించుకున్న ఈ కార్యక్రమం మళ్ళీ నేడు పురుడు పోసుకోబోతోంది.
అయితే ‘జన్మభూమి’ వలన చంద్రబాబుకు జరిగిన మేలును పక్కన పెడితే, ఈ కార్యక్రమం ద్వారా చంద్రబాబు చాలానే కోల్పోయారు. విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగుల వంటి వారే కాక ఐఏయస్, ఐపీయస్ వంటి అత్యున్నత విధ్యాబుద్ధులు కలిగిన వారి చేత కూడా ‘శుభ్రత – పరిశుభ్రత’ కార్యక్రమాలు చేయించడం విమర్శలకు తావిచ్చింది. దీని వల వ్యక్తిగతంగా చాలా మంది అభిమానానికి దూరమయ్యారు చంద్రబాబు. అలాగే తన క్యాబినెట్ లో ఉన్న సహచరులు కూడా ఈ జన్మభూమిలో పాల్గొనాలని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో, సదరు మంత్రులు, ప్రజాప్రతినిధులు అయిష్టంగానైనా ‘జన్మభూమి’లో భాగస్వామ్యం కావాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఇలా చంద్రబాబు మహత్తర ఉద్దేశం ప్రజలకు చేరువ అయ్యింది గానీ, ప్రభుత్వంలో భాగస్వామ్యులైన వారికి మాత్రం తీవ్ర మనోవేదనను మిగిల్చింది. మరి ప్రభుత్వ వర్గాల నుండి అంతటి వ్యతిరేకతను ఎదుర్కొన్న ‘జన్మభూమి’ మళ్ళీ పునర్వైభవం తెచ్చుకుంటుందా? లేక నామమాత్రపు కార్యక్రమంగానే మిగిలిపోతుందా? ఎందుకంటే, గతంలో మాదిరి ప్రభుత్వ ఉద్యోగుల పట్ల గానీ, అధికారుల పట్ల గానీ చంద్రబాబు వ్యవహరించడం లేదు. ఎక్కువ ఉదాసీనతకు పోయి, వైయస్ రాజశేఖర్ రెడ్డి మాదిరి ప్రభుత్వ వర్గాలకు అలసత్వాన్ని ఇస్తున్నారన్న విమర్శలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. మరి వీటిని చెక్ పెట్టె విధంగా ‘జన్మభూమి’ని చంద్రబాబు అమలు చేసి చూపుతారా? ఒకవేళ అదే జరిగితే ప్రభుత్వ వర్గాలు చంద్రబాబుకు సహకరిస్తారా? అనేవి ప్రస్తుతానికి శేష ప్రశ్నలు.





