మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్న ‘స్త్రీశక్తి’ పథకానికి అప్పుడే ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలతో కలిసి బస్సులో రాయపూడి పరేడ్ గ్రౌండ్స్ నుంచి సీడ్ యాక్సిస్ రోడ్ మీదుగాప్రయాణించారు.
ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఉచిత ప్రయాణం వల్ల నెలకు ఎంత డబ్బు ఆదా అవుతోంది? ఆ డబ్బును కుటుంబ అవసరాలకు ఎలా ఉపయోగిస్తున్నారు? అని అడిగి తెలుసుకున్నారు.
మత్స్యకార, చేనేత రంగాలకు చెందిన మహిళలు, విద్యార్థినులు తమ అనుభవాలను సీఎంతో పంచుకున్నారు. ఇదివరకు బస్సు ప్రయాణానికి అయ్యే ఖర్చు స్త్రీశక్తితో ఇప్పుడు ఆదా అవుతోందని, ఆ డబ్బును తమ కుటుంబ అవసరాలకు, పొదుపు కోసం, వ్యాపారాలకు, ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటున్నామని మహిళలు చెప్పారు.
మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలని సిఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఆదాయం వచ్చినప్పుడు కొంత మొత్తాన్ని తప్పనిసరిగా పొదుపు చేసుకోవాలని, అలాగే ఆరోగ్యంపై కూడా మహిళలు మరింత శ్రద్ధ పెట్టాలని చెప్పారు.
‘స్త్రీశక్తి’ పథకం వల్ల మహిళలకు ప్రయాణ ఖర్చు తగ్గడంతో పాటు, వారు షేర్ ఆటోలలో ప్రయాణించడం మానుకున్నారు కనుక సురక్షితంగా ఇళ్ళకు చేరుకుంటున్నారని అందుకు చాలా సంతోషంగా ఉందని సిఎం చంద్రబాబు నాయుడు చంద్రబాబు అన్నారు. ఈ పధకం అమలు చేసినప్పటి నుంచి రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఓ ప్రకటనలో రాష్ట్రంలోని 76 శాతం ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఈ పథకం అమలవుతోందని, ఇప్పటివరకు మొత్తం 87 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయని తెలిపింది.
స్త్రీశక్తి పధకానికి ఏడాది పూర్తయిన సందర్భంగా సిఎం చంద్రబాబు నాయుడు తమతో కలిసి బస్సులో ప్రయాణించడంపై మహిళలు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి మంచి పథకం ప్రవేశపెట్టి తమకు సాయపడుతున్నందుకు మహిళలు సిఎం చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అనంతరం సీఎం వారందరినీ తన క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి వారితో కలిసి హైటీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘స్త్రీ శక్తి’కి One Year.. మహిళలతో కలిసి Free Busలో CBN..!@ncbn pic.twitter.com/Y1cVZdlaqe
— M9 NEWS (@M9News_) August 15, 2026




