చంద్రబాబు ప్రజా గళం వినిపిస్తుంటే, జగన్‌ మేమంతా సిద్దం అట!

Chandrababu Naidu Praja Galam YS Jagan Memantha Siddham

ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు ముహూర్తం ప్రకటించడంతో, టిడిపి, జనసేన, వైసీపి మూడు పార్టీలు ఎన్నికల శంఖారావం పూరించాయి.

ADVERTISEMENT

చంద్రబాబు నాయుడు నేడు చిత్తూరు జిల్లా పలమనేరులో‘ప్రజా గళం’ ఎన్నికల ప్రచారయాత్రలో పాల్గొంటున్నారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నుంచి వారాహి యాత్రలకు శ్రీకారం చుట్టారు.

వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి నేటి నుంచి ‘మేమంతా సిద్దం’ పేరుతో ఇడుపాలపాయ నుంచి ప్రొద్దుటూరు మీదుగా ఆళ్ళగడ్డ వరకు బస్సు యాత్రతో ప్రజల మద్యకు వస్తున్నారు.

చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లకు జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ఓ తేడా ఉంది. వారిరువురూ మొదటి నుంచి ప్రజల మద్యే తిరుగుతున్నారు. తాజాగా బీజేపీతో పొత్తులు, సీట్ల సర్దుబాట్లు చేసుకోవడంతో వారు ఏమి చెపుతారో అని ఆసక్తితో ప్రజలు స్వచ్ఛందంగా వారి సభలకు తరలి వస్తున్నారు.

కానీ ఈ 5 ఏళ్లలో జగన్మోహన్‌ రెడ్డి ఎక్కువ కాలం తాడేపల్లి ప్యాలస్‌కే పరిమితం అయ్యారు. బటన్ సభల కోసమే బయటకు వచ్చి పోతుండేవారు. ఆ సభలలో కూడా కొత్త విషయం ఒక్కటీ చెప్పలేక పాడిందే పాచిపాట అన్నట్లు చంద్రబాబు నాయుడు కుట్రలు, పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్ళిళ్ళు అంటూ తన హోదాకు తగని విదంగా మాట్లాడుతుంటారు.

కనుక వైసీపి నేతలు, వాలంటీర్ల ఒత్తిడికి తలొగ్గి జగన్‌ సభలకు హాజరయ్యేవారే తప్ప స్వచ్ఛందంగా తరలి వచ్చేవారు తక్కువే.

అయినప్పటికీ ఇదివరకు జగన్‌ బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తారనే చిన్న ఆశ ఉండేది. కానీ ఎన్నికల కోడ్ కారణంగా బటన్ నొక్కలేని పరిస్థితి. బహుశః అందుకే జనాలను తన సభలకు రప్పించుకోవడం కంటే, వారు ఉన్న చోటికే తాను చేరుకోవడం మంచిదని జగన్‌ భావించి బస్సులో బయలుదేరుతున్నారేమో?

ప్రజలు ఎదురు చూస్తున్నట్లే చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో మతతత్వ బీజేపీతో పొత్తులు ఎందుకు పెట్టుకోవలసిందో ప్రజలకు వివరించి, తాము రాజకీయ, రాష్ట్ర అవసరాల కోసమే బీజేపీతో పొత్తులు పెట్టుకున్నాము తప్ప మైనార్టీల విషయంలో టిడిపి విధానాలలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు.

మైనార్టీల సంక్షేమానికి టిడిపి కట్టుబడి ఉంటుందని, టిడిపి, జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి రాగానే మైనార్టీలతో సహా అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.

రాయలసీమ వాసులకు త్రాగు,సాగునీరు అందించలేకపోయిన జగన్మోహన్‌ రెడ్డి ఇప్పుడు ఎన్నికల కోసం ప్రజల మద్యకు వస్తున్నారని, కనుక ఆయన మాయమాటలు నమ్మి మళ్ళీ మోసపోకుండా త్వరలో జరుగబోయే ఎన్నికలలో బుద్ధి చెప్పాలని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.

పలమనేరులో ఎండలు మండిపోతున్నా చంద్రబాబు నాయుడు ఏమాత్రం జంకకుండా ప్రజా గళం వినిపిస్తుంటే, ప్రజలు కూడా ఎండలు లెక్కచేయకుండా అయన సభలకు తరలివస్తుండటం గమనిస్తే, మూడు రాజధానుల పేరుతో ప్రజలను టిడిపికి దూరం చేయాలనే జగన్‌ ఎత్తు పారలేదని అర్దమవుతోంది.

ADVERTISEMENT
Latest Stories