ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ పై ఫైర్ అయ్యారు. జనవరి మొదటి వారంలో గుంటూరులో బీజేపీ తలపెట్టిన భారీ బహిరంగ సభకు ప్రధాని హాజరు కాబోతున్నారు. దీనిపై చంద్రబాబు స్పందించారు. ‘‘రాష్ట్రానికి ప్రధాని మోదీ తీవ్ర అన్యాయం చేశారు. మనం బతికామా.. చచ్చమా చూసేందుకు ప్రధాని వస్తున్నారా? ఏ ముఖం పెట్టుకుని ఏపీకి వస్తున్నారు? రాష్ట్రానికి ఇవ్వాల్సినవి ఇచ్చి.. ప్రచారం చేసుకోండి,” చంద్రబాబు ఫైర్ అయ్యారు.
[m9ad]
“కేంద్ర ప్రభుత్వం సాయం లేకుండానే రాష్ట్రంలో అభివృద్ధి సాధించాం. రాష్ట్రానికి రావాల్సినవి దక్కే వరకు పోరాటం ఆపేది లేదు,” అని అన్నారు ఆయన. బీజేపీతో వైఎస్సాఆర్ కాంగ్రెస్, జనసేన పార్టీలు కుమ్మక్కయ్యాయని, గట్టిగా అడిగితే రాయలసీమ, ఉత్తరాంధ్రలో డిక్లరేషన్ల పేరుతో చిచ్చుపెట్టాలని చూశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. వచ్చే ఎన్నికలలో బీజేపీతో పాటు ఆ పార్టీకి సహకరిస్తున్నవారికి ప్రజలు బుద్ధి చెప్పాలని, తెలుగువారి సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు.
“తెరాస కూడా ప్రత్యేక హోదాకు మద్దతు ఇచ్చి వెనక్కి తీసుకుందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు తెరాస ఎందుకు యూ టర్న్ తీసుకుందని చంద్రబాబు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లోని విపక్షాలు తెరాసను నిలదీయకుండా మద్దతు ఇచ్చాయని, టీఆర్ఎస్ విజయంపై వైసీపీ నేతలు సంబరాలు చేసుకున్నారని ఆయన దుయ్యబట్టారు. తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ లో ఉండగానే తెరాసపై చంద్రబాబు నిప్పులు చెరగడం గమనార్హం. దీనిపై కేసీఆర్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.



