ఇంతవరకు టిడిపి నేతలు మాత్రమే హూ కిల్డ్ బాబాయ్?అని అడుగుతున్నారు. కానీ ఇప్పుడు జగన్ కూడా హూ కిల్డ్ బాబాయ్?అని అడగడం కలికాలం కాదా?అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
ప్రజాగళంలో భాగంగా శనివారం ప్రొద్దుటూరు రోడ్ షో చేసినప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, “ఈ కేసులో నిందితుడిని పక్కనే పెట్టుకొని బాబాయ్ని ఎవరు చంపారు?అని జగన్ అడుగుతున్నారు. ఆ నిందితుడికి ఎంపీ టికెట్ కూడా ఇచ్చి ఆయనను గెలిపించమని ప్రజలని అడుగుతున్నారు. ఇది కలికాలం కాకపోతే మరేమిటి?
ఓ పక్క నిందితుడిని కాపాడుతూ, న్యాయం చేయమని అడిగిన తన చెల్లెలు సునీతా రెడ్డి మీద తన సైన్యాన్ని ఉసిగొల్పుతున్నారు. నిందితులను కాపాడుతూ బాధితులపైనే కేసులు పెట్టిస్తున్నారు. ప్రజలు మీకు ఎందుకు ఓట్లు వేయాలో చెప్పాలని నేను అడుగుతున్నాను,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.
జగన్ చెప్పుకొనే ‘మేలు’ గురించి కూడా చంద్రబాబు నాయుడు ఓ మాట అన్నారు. “మీ అందరికీ చాలా ‘మేలు’ చేశానని, కనుక అందరూ తనకే ఓట్లు వేయాలని జగన్ పదేపదే చెప్పుకుంటున్నారు. నేను అదే చెపుతున్నాను. జగన్ వలన మీకు నష్టం జరిగిందని భావిస్తే, జగన్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే మీ జీవితాలు దుర్భరం అవుతాయని మీరందరూ అనుకుంటే, తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేయమని మీ అందరినీ కోరుతున్నాను. నా మీద నమ్మకముంచి మిత్రపక్షాలను గెలిపిస్తే, రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్ది మళ్ళీ అభివృద్ధిపధం వైపు నడిపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా దయనీయంగా మారినప్పుడు రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడుపై నమ్మకం ఉంచి ఆయనకు పగ్గాలు అప్పగించారు. అటువంటి క్లిష్ట పరిస్థితులలో కూడా ఆయన నిబ్బరం కోల్పోకుండా సమస్యలన్నిటినీ ఒకటొకటిగా పరిష్కరిస్తూ వారి ఆకాంక్షల ప్రకారమే పనిచేశారు.
ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల గురించి అందరికీ తెలుసు. 2019 ఎన్నికల సమయంలో రాష్ట్రాన్ని జగన్ చేతిలో పెట్టి నాశనం చేసుకోవద్దని చంద్రబాబు నాయుడు పదేపదే ప్రజలకు చెప్పారు. కానీ ప్రజలు జగన్తో ఓ ప్రయోగం చేసి ఈ 5 ఏళ్ళలో దాని రుచి కూడా చూశారు.
కనుక మరోసారి ‘మేలు’ కోరుకుంటే ప్రజలే దానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుందనే చంద్రబాబు నాయుడు సూటిగానే చెపుతున్నారు. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలే ‘మేలు’ కావాలో ‘అభివృద్ధి’ కావాలో ఆలోచించి నిర్ణయించుకోవాలి.




