పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన టీడీపీ, జనసేన పార్టీల అధినేతల రోడ్ షో లో ప్రసంగించిన చంద్రబాబు నాయుడు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కాలుమూరువెంకట నాగేశ్వరరావు పై విమర్శలు గుప్పించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన చేస్తున్న దోపిడీని, విధ్వంసాన్ని స్థానిక ప్రజలకు వివరించారు.
ఎర్రిపప్ప అనేది తప్పేమి కాదు అన్న ఎర్రిపప్ప మంత్రి ఇక్కడే ఉన్నాడు, స్థానిక రైతుల కష్టాలను కించపరుస్తూ రైతులను అవమానించిన వ్యక్తిని ఇంటికి పంపాల్సిన సమయం వచ్చింది అంటూ ప్రజలకు పిలుపిచ్చారు. అగ్నికి వాయువు తోడయ్యింది, ప్రజాగళానికి, వారాహి కలిసి వచ్చింది, జెండాలు మూడైన ఎజెండా ఒక్కటే…ఇక నిర్ణయం మీ చేతిలోనే ఉంది ఆలోచించి ఓటేయమన్నారు.
ఈ 30 రోజులు మీరు మా కూటమికి మద్దతుగా ఉండి కూటమి విజయానికి సహకరిస్తే.., రానున్న ఐదేళ్లు మేము మీకు అండగా ఉంటాం. టీడీపీ – జనసేన సంకల్పానికి బీజేపీ కి సహకారం అవసరం. ఇప్పుడు బీజేపీ సహకారంతో మరోసారి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది అన్నారు.
అలాగే నేను ఇబ్బందులలో ఉన్నప్పుడు బేషరతుగా పార్టీకి, నాకు అండగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన ఇచ్చిన మద్దతు కు టీడీపీ తమ్ముళ్లు ఎప్పుడు రుణపడి ఉంటారు అంటూ పవన్ పై తనకున్న గౌరావాన్ని తెలియచేసారు. కూటమి జట్టుకట్ఠడానికి జనసేన, పవన్ చాలా తగ్గారు, అలాగే టీడీపీ నాయకులు కూడా ఎన్నో త్యాగాలు చేసారు.
వాటన్నిటికీ 2024 ఎన్నికలలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపైనే ఉంది తమ్ముళ్లు అంటూ అందుకు సిద్ధమా..? అంటూ తణుకు ప్రజలను ప్రశ్నించారు. 2014 గణాంకాల ఆధారంగా ఇక్కడ టీడీపీ, జనసేన కు గట్టి పట్టున్న మాట వాస్తవం. అయితే గత ఎన్నికలలో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడంతో దాన్ని అవకాశంగా తీసుకున్న వైసీపీ విజయ కేతనాన్ని దక్కించుకుంది.
ఇప్పుడు మళ్ళీ అదే కూటమి ఎన్నికల బరిలో నిలవబోవడంతో పశ్చిమ గోదావరి జిల్లాల 2014 ఫలితాలే పునరావృతం అవుతాయనే ఆశతో ఉన్నారు కూటమి అభ్యర్థులు.




