బీజేపీపై సమరశంఖం పూరించిన తెదేపా జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రస్థానంలోనే అత్యంత కీలకమైన అడుగు వేశారు. ఎన్డీయే వ్యతిరేక పక్షాలన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు స్వయంగా నడుం బిగించిన చంద్రబాబు.. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.
[m9ad]
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలి సంతకం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపైనే ఉంటుందని రాహుల్ ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ కాంగ్రెస్ పొత్తుకు మార్గం సుగమం అయినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడితో రాజకీయ సంప్రదింపులు జరపడం 20 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
1996లో కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఆయన అప్పటి కాంగ్రెస్ అధ్యక్షులు పీవీ నరసింహరావు, సీతారాం కేసరిలతో సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. అయితే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా స్థాపింపబడ్డ టీడీపీ డైరెక్టుగా ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఇదే మొదటి సారి. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ అడుగు అని చంద్రబాబు ప్రజలకు చెప్పి వారికి నచ్చ చెప్పాలి.
రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కాంగ్రెస్ కు అంత అనుకూలమైన పరిస్థితులు ఏమీ లేవు. కావున ఇది చంద్రబాబు తీసుకున్న రిస్క్ అనే చెప్పాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలి సంతకం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపైనే అంటున్నారు కాబట్టే పొత్తు అనే విషయాన్నీ ప్రజలు ఎలా తీసుకుంటారో చూడాలి. కాంగ్రెస్, తెలుగు దేశం ఇప్పటికే తెలంగాణాలో కలిసి పోటీ చేస్తున్నాయి.



