2014 అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి చంద్రబాబు అందరిపై కాస్త చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ ‘ఉదాసీనత’ ఎంతవరకు వెళ్లిందంటే… రెవిన్యూ శాఖలో అవినీతి జరుగుతోందని స్వయంగా చంద్రబాబే మీడియా ముఖంగా చెప్పేటంతగా! ఒక్క అధికారుల విషయంలోనే కాదు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలోనూ చంద్రబాబు ఇదే శైలితో ముందుకు వెళ్తున్నారు. అలాగే ప్రతిపక్ష నాయకుడు జగన్ అనేక సందర్భాలలో కాస్త కటువుగా మాట్లాడిన సమయంలోనూ చంద్రబాబు చాలా ‘లైట్’గా తీసుకున్నారు.
వాస్తవానికి గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో చంద్రబాబు ‘దూకుడు’ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కానీ, ప్రస్తుతం అలాంటి ‘దూకుడు’ను ప్రదర్శించలేకపోతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో జనాలను సోమరిపోతులుగా మారుస్తున్నారని చంద్రబాబు పలు సందర్భాలలో విమర్శించారు. అలా అలవాటు అయిన వారిని ఇపుడు కొత్తగా పని చేయాలని నియమ నిబంధనలు పెడితే వ్యతిరేకత వస్తుందన్న భావన చంద్రబాబు వ్యవహార తీరులో కనపడుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇలాంటి ఉదాసీనత వ్యవహారమే రోజా నోటికొచ్చినట్లు మాట్లాడేలా చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, ప్రస్తుతం రోజా దూకుడుకు అడ్డుకట్ట వేసి చంద్రబాబు తన మునుపటి వైభవాన్ని సంతరించుకుంటే పాలన గాడిలో పడిన సంకేతాలను ప్రజలకు పంపిన వారవుతారని విశ్లేషకుల నుండి వ్యక్తమవుతున్న అభిప్రాయం. అసెంబ్లీ వేదికగా రోజా పలికిన “అన్ సెన్సార్డ్ లాంగ్వేజ్”కు కేవలం ఒక్క ఏడాది బహిష్కరణ సరిపోదని, తన శాసనసభా కాలమంతా రద్దు చేస్తే గానీ, మరొకరు ఇలాంటి భాషను వాడడానికి సంశయిస్తారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కనీసం ఈ సందర్భంలో అయినా చంద్రబాబు తన మునుపటి వ్యవహార తీరును ప్రదర్శించాలని టిడిపి వర్గీయులు కూడా ఆశిస్తున్నారు.





