ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠాత్మక రాజధాని అమరావతి నిర్మాణానికి కేవలం 2,500 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసారు. ఆ 2,500 కోట్ల రూపాయల్లో కూడా ఇంకా 1,500 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేస్తామని, గతంలో విజయవాడ, గుంటూరు నగరాలకు ఇచ్చిన 1000 కోట్ల రూపాయల నిధులు అమరావతి నిర్మాణానికి ఇచ్చిన నిధులేనని కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్పినట్లుగా బాబు విశదీకరించి చెప్పారు.
అయితే కేంద్రం ఇస్తామంటున్న నిధులతో అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ కూడా పూర్తి కాదన్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబే తెలిపారు. అవును… అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థను కూడా నిర్మించలేని మొత్తంతో ఒక రాజధానిని ఎలా నిర్మించుకోవాలి? నాడు ఎన్నికల ప్రచారంలో గుజరాత్ తర్వాత తన ఫోకస్ అంతా ఆంధ్రప్రదేశ్ పైనే ఉంటుందని చెప్పిన మోడీ వ్యాఖ్యలు ఏమయ్యాయి? అంటే, నోరు లేని ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల వివక్ష చూపడం కేంద్ర ప్రభుత్వాలకు అనాదిగా వస్తున్న ఆచారంలో భాగంగా మారిపోయినట్లుంది. ఒక రకంగా చెప్పాలంటే… ఏపీని మోసం చేయడం కేంద్ర ప్రభుత్వాల హక్కుగా భావించాల్సి వస్తుందేమో..!
మరి ఈ నేపధ్యంలో తమ తెలివితేటలు, సాంకేతిక పరిజ్ఞాన సహకారంతో నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం చేపడతామని, అందులో వెనక్కి తగ్గేది లేదని, ముందుగా చెప్పినట్లుగా అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిని నిర్మిస్తామని చంద్రబాబు ఏపీ ప్రజలకు కాస్త మనోధైర్యాన్ని ఇచ్చే మాటలు చెప్పారు. చేయాలన్న పట్టుదల, కాంక్ష చంద్రబాబులో కనపడుతున్నా, కేంద్రం సహకారం, నిధులు లేకుండా చేసే ప్రణాళికలు కేవలం పేపర్ కే పరిమితం అవుతాయన్న విషయాన్ని గమనించాలి. అయినా ఆ 2500 కోట్లు మాత్రం ఎందుకు ఇచ్చినట్లు… రాష్ట్ర ప్రజలంతా తమకు తోచిన చందాలు ఇచ్చినా అంతకు మించిన మొత్తం వచ్చేవేమో… అన్న ఆవేదనతో కూడిన మాటలు ఏపీ ప్రజల నుండి వస్తున్నాయి.



