స్థానిక ఎన్నికల సమరానికి పార్టీ క్యాడర్, లీడర్ లకు కూటమి ప్రభుత్వం మీద యుద్ధం చెయ్యాల్సిందే అంటూ తేల్చి చెప్పిన జగన్ దాని తరువాత వచ్చే ఫలితాల మీద కూడా ఇప్పుడే పరోక్షంగా ప్రకటనలు చేస్తున్నారు.
సీఎం చంద్రబాబు స్థానిక ఎన్నికలను సజావుగా జరిపిస్తారనే నమ్మకం తనకు లేదని, అధికారులను అడ్డుపెట్టుకుని, చేతిలో ఉన్న అధికారాన్ని ఆయుధంగా మార్చుకుని దౌర్జన్యాలకు, బెదిరింపులకు పాల్పడతారంటూ అయినా కూడా వైసీపీ క్యాడర్, లీడర్ అందరు ఏకతాటి మీదకొచ్చి గెలుపోటములను పక్కన పెట్టి ముందు పోటీ బరిలో ఉండాలంటూ ప్రకటించారు.
అయితే జగన్ చేసిన ఈ ప్రకటనను ఒక్కసారి క్షుణ్ణంగా పరిసలిస్తే ఎన్నికలకు ముందే జగన్ తన పార్టీ ఓటమిని పరోక్షంగా అంగీకరించారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గెలిచినా లేకున్నా పోటీ ముఖ్యం అంటూ పార్టీ క్యాడర్ ని పోటీలో దింపడమే జగన్ ఆలోచనగా కనిపిస్తుంది.
బాబు తన అధికారాన్ని, తన దగ్గరున్న అధికారులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకు దిగుతాడు అంటూ జగన్ ముందుగానే ప్రకటించడంతో రేపటి రోజున స్థానిక ఎన్నికలలో వైసీపీ మరో పరాజయాన్ని మూటకట్టుకున్నా మేం ముందే చెప్పినట్టు ప్రభుత్వం మా నాయకులను బెదిరించి, మా కార్యకర్తల మీద దౌర్జన్యం చేసి గెలిచింది అంటూ కూటమి గెలుపుని తగ్గించవచ్చు.
ఒకవేళ వైసీపీ స్థానిక ఎన్నికలలో జయకేతనం ఎగరేస్తే కూటమి ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకతకు ఇదే ప్రత్యక్ష నిదర్శనం అంటూ జగన్ 2.0 కు ఇదే శుభారంభం అంటూ పార్టీ క్యాడర్ ని పొలిటికల్ గా మరికాస్త యాక్టీవ్ చేసే అవకాశం ఉంటుంది.
అయితే ఈ అవకాశం ఒక్క ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే సొంత. అది నేటి వైసీపీ పార్టీ అయినా నాటి టీడీపీ, జనసేన అయినా స్క్రిప్ట్ లో ఎటువంటి మార్పులు ఉండవు సుమీ..! ఈ విషయంలో మాత్రం రెండు వైపులా పొదునున్న కత్తిలా ప్రతిపక్ష పార్టీలకు ఓడినా, గెలిచినా ఆ ఫలితాన్ని తమకు అనుకూలంగా మలచుకునే అవకాశం ఉంటుంది.





