వైసీపి సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొంతమందిని వారి అధినేత జగన్మోహన్ రెడ్డి వద్దనుకొంటుంటే, ఆయన ఎంపిక చేస్తున్న మరికొందరిని వైసీపి నేతలు వద్దనుకొంటున్నారు. మొత్తం మీద వైసీపి వద్దనుకొంటున్నవారి జాబితా నానాటికీ పెరిగిపోతూనే ఉంది.
సుమారు మూడు నెలల క్రితం అంటే అక్టోబర్ 13న జగన్ కాకినాడ జిల్లా పెద్దాపురంలో పర్యటించినప్పుడు, ఆ నియోజకవర్గం ఇన్చార్జిగా దవులూరి దొరబాబుగా నియమించి, పార్టీ నేతలందరూ ఆయనకు పూర్తి సహాయసహకారాలు అందించాలని ఆదేశించారు. మొదట్లో బాగానే ఉండేది కానీ మూడు నెలలు తిరిగేసరికి ఏమైందో ఏమో పెద్దాపురం వైసీపి నేతలు ఆయనను వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఆయనను వెంటనే మార్చాల్సిందేనని లేకుంటే ఎన్నికలలో సహకరించబోమని, అవసరమైతే పార్టీని వీడేందుకు కూడా సిద్దమేనని తెగేసి చెప్పేశారు.
ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్ళీ టికెట్ ఇవ్వడం లేదని నిన్ననే జిల్లా ఇన్చార్జి మిధున్ రెడ్డి నిన్ననే చెప్పేశారు. దాంతో ఆ మూడు నియోజకవర్గాల వైసీపిలో అసంతృప్త జ్వాలలు భగ్గుమన్నాయి.
కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపిలో కధ మరోలా ఉంది. ప్రొద్దుటూరు వైసీపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అధిష్టానం అండ చూసుకొని చెలరేగిపోతున్నారని, ఆయన అండ చూసుకొని ఆయన బావమరిది పురపాలక వైస్ ఛైర్మన్ బంగారు రెడ్డి కూడా తమతో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, కొత్తపల్లి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అలాగే కొందరు వైసీపి కౌన్సిలర్లు కూడా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, బంగారు రెడ్డిల తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
13వ వార్డు ఇర్ఫాన్ బాషా వారందరికీ స్థానిక రిసార్టులో శుక్రవారం విందు ఇచ్చారు. అంటే అసమ్మతివాదులు అందరూ ఒకచోట భేటీ అయ్యారన్న మాట! ఈ పరిస్థితి మారాలంటే ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని మార్చడం ఒక్కటే దారి అని వారు తీర్మానించిన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే తమ తరపున ఒకరిద్దరిని తాడేపల్లికి పంపించి జగన్మోహన్ రెడ్డికి తమ గోడు మొరపెట్టుకొని, రాచమల్లుని మార్చాలని కోరాలని వారు నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది.
మంగళగిరి వైసీపి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేయగానే, ఆయన స్థానంలో గంజి చిరంజీవిని నియోజకవర్గం ఇన్చార్జిగా నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఆళ్ళ పార్టీని వీడినప్పటికీ ఎన్నికలలో తనకు సహాయసహకారాలు ఇవ్వాలని కోరేందుకు గంజి చిరంజీవి, మొన్న ఆళ్ళ నివాసానికి వెళ్ళి సుమారు గంటసేపు బయట వేచి చూశారు. కానీ ఆళ్ళ ఆయనని కలిసేందుకు ఇష్టపడలేదు.
హైదరాబాద్ వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత తన భవిష్య కార్యాచరణ ప్రకటిస్తానని ఆళ్ళ చెప్పారు. కానీ మంగళగిరి నుంచి నారా లోకేష్ మళ్ళీ పోటీ చేయబోతున్నారు. కనుక ఆయనకు టిడిపి, జనసేన రెండూ కూడా ఆ సీటు ఇవ్వలేవు.
ఇన్నేళ్ళుగా జగన్ని నమ్ముకొని ఆయన కోసం చంద్రబాబు నాయుడుతో పోరాడినందుకు ఆళ్ళ నేడు రాజకీయ జంక్షన్లో రాజకీయ నిరుద్యోగిగా మిగిలిపోయారు పాపం. వైసీపి నేతలని ఎవరిని కదిపినా ఇలాంటి కన్నీటి కధలే వినిపిస్తున్నాయి ఇప్పుడు… పాపం!




