వైసీపీకి అమరావతి రాజధానిగా ఇష్టం లేదు. కనుక అది అధికారంలో ఉన్నప్పుడు అది కోరుకున్నట్లుగానే ఒకటో రెండో మూడో రాజధానులు ఏర్పాటు చేసి ఉండవచ్చు. కానీ ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ అది చెప్పిన వాటిలో ఏ ఒక్క రాజధాని ఏర్పాటు చేయలేకపోయింది.
సరే! అధికారంలో కొనసాగి ఉంటే తప్పకుండా విశాఖని రాజధాని చేసి ఉండేది అని అనుకోవడానికి వీల్లేకుండా జగన్మోహన్ రెడ్డి ‘మావిగన్’ బాంబ్ పేల్చారు. కనుక రాజధాని విషయంలో వైసీపీకి నిర్దిష్టమైన ఆలోచన, ప్రణాళిక రెండూ లేవని స్పష్టమైంది.
అయితే సిఎం చంద్రబాబు నాయుడు చాలా నిర్దిష్టంగా అమరావతి రాజధాని అని ప్రకటించి, మొదటి నుంచి నేటి వరకు దానికే కట్టుబడి ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం చేత అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని గుర్తింపజేయడం, చకచకా నిర్మాణ పనులు కొనసాగిస్తుండటం ఆయన నిబద్దతకు నిదర్శనమనుకుంటే, జగన్ వైసీపీ రాజకీయాలకు మావిగన్ నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
జగన్మోహన్ రెడ్డికి అమరావతి ఇష్టం లేదు కనుక వైసీపీ నేతలు కూడా తలూపక తప్పదు. కానీ ఇతర రాష్ట్రాలు అసూయ పడే విధంగా నిర్మితమవుతున్న అమరావతిని ద్వేషించడం సిగ్గుచేటు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడిన మాటలు ఈ ద్వేషానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు.
“రాజ్యాంగంలో చెప్పినట్లు సంపదని అన్ని జిల్లాలకు సమానంగా పంపిణీ చేయాలనే ప్రాధమిక సూత్రానికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు మొత్తం డబ్బంతా తీసుకువెళ్ళి అమరావతిలోనే పెట్టేస్తున్నారు. రాష్ట్రంలో మిగిలిన జిల్లాలను పట్టించుకోవడం లేదు.
ఈ కారణంగా భవిష్యత్లో ఏదో రోజు మళ్ళీ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు జరిగే అవకాశం ఉంటుంది. నాడు హైదరాబాద్ని ఏవిధంగా వదులుకొని కట్టుబట్టలతో వచ్చేశామో, అదేవిధంగా భవిష్యత్లో అమరావతిని వదులుకొని వచ్చేయవలసి ఉంటుంది. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు,” అని ధర్మాన ప్రసాదరావు అన్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి.. రాజధాని, పోలవరం పూర్తిచేయండి.. పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పించమని ప్రజలు వైసీపీకి అధికారం కట్టబెడితే వీటిలో ఏ ఒక్కటీ చేయలేకపోయింది.
కానీ కూటమి ప్రభుత్వం వారి కళ్ళెదుటే ఇవన్నీ చేసి చూపిస్తుంటే మెచ్చుకోకపోయినా పర్వాలేదు. కానీ ఓర్వలేనితనంతో మళ్ళీ రాష్ట్ర విభజన అంటున్న వైసీపీని ప్రజలు క్షమిస్తారా?




