దీపావళి పండుగ సందర్భంగా కాల్చే బాణాసంచా పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బాణాసంచాను నిషేధించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా దృష్ట్యా దీపావళికి బాణాసంచా పేల్చకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో న్యాయవాది ఇంద్ర ప్రకాశ్ పిల్ దాఖలు చేశారు. ఇటువంటి సమయంలో బాణాసంచా వల్ల ఇబ్బందులు తప్పవని పిటిషనర్ పేర్కొన్నారు.
వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. ఇప్పటి వరకు తెరిచిన బాణాసంచా షాపులను మూసివేయాలని ఆదేశించింది. ఎవరూ బాణాసంచా అమ్మడం, కొనడం చేయొద్దని తన ఆదేశాల్లో పేర్కొంది. ఎవరైనా అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేయాలని, ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఈ నెల 19న తెలపాలని హైకోర్టు తెలిపింది.
నిషేధంపై ప్రభుత్వం విస్తృత ప్రచారం చేయాలని ధర్మాసనం సూచించింది. ఈ తీర్పుతో దీపావళి బాణాసంచాను నిషేధించిన పదవ రాష్ట్రంగా తెలంగాణ అయ్యింది. ఇప్పటికే ఢిల్లీ, రాజస్థాన్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, హర్యానాతో పాటు పలు రాష్ట్రాలు టపాసుల అమ్మకాలు, విక్రయాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
దీంతోపాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ కూడా ఢిల్లీ ఎన్సీఆర్, తదితర ప్రాంతాల్లో నవంబరు 31వరకు నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ తీర్పుపై బాణాసంచాను అమ్మే వర్తకులు లబోదిబో అంటున్నారు. ఇప్పటికే సరుకు కొనేశామని ఇప్పుడు అమ్మకాలు వద్దంటే తమకు లక్షల్లో నష్టం వస్తుందని వారు వాపోతున్నారు. దాదాపుగా 40-60% మంది పండుగకు ఒకరోజు, రెండు రోజులలోనే కొనుగోళ్లు చేస్తారని వారు అంటున్నారు.





