వైసీపి అధినేత జగన్ ‘నా దళితులు… నా బీసీలు… నా మైనార్టీలు…’ అంటూ తరచూ రాగం తీస్తుంటారు. ఆయా వర్గాల నేతలకు తన ప్రభుత్వంలో పదవులు, వైసీపిలో టికెట్లు ఇచ్చినప్పటికీ పెత్తనం అంతా రెడ్డి సామాజిక వర్గానిదే అని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నవారందరూ చెపుతుంటారు.
తిరుమల పాలక మండలి, పోలీస్ ఉన్నతాధికారులు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్ల జాబితాని ఓసారి చూస్తే పెత్తనం మనవాళ్ళ చేతుల్లోనే ఉండాలని జగన్ కోరుకొంటున్న విషయం అర్దమవుతుంది.
కానీ వైసీపిలో బడుగు బలహీనవర్గాల నేతలు జగన్ను కాదని వేరే పార్టీలలోకి మారితే ఏమవుతుందో వారికీ తెలుసు. కనుక ఇంత కాలం అవమానాలు భరిస్తూ పార్టీనే అంటిపెట్టుకునే ఉన్నారు. కానీ ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడటతో ఒకరొకరుగా పార్టీని వీడుతున్నారు.
రెండు రోజుల వ్యవధిలో వైసీపి నుంచి ఓ ఎమ్మెల్యే, ఓ ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్.బాబు శనివారం రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోగా, ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ పార్టీకి, పదవికి కూడా రాజీనామా చేసేశారు. అంతకు ముందు అనేక మంది పార్టీని వీడి టిడిపి, జనసేనలలో చేరిపోయారు.
తాజాగా డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా వైసీపికి రాజీనామా చేసేందుకు సిద్దమైపోయారు. మొదట ఆయన వైసీపిలో చేరినప్పుడు జగన్ కాస్త ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ ఎన్నికలొచ్చేసరికి ఆయనను పక్కన పెట్టేశారు. కనుక ఒక్కసారి జగన్ను కలిసి తన గోడు చెప్పుకునేందుకు అవకాశం కల్పించాలని ఆయన మంత్రులను ఎంతగా వేడుకొన్నా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో పార్టీలో తన స్థానం ఏమిటో ఇప్పటికి ఆయనకు అర్దమైంది.
దీంతో ఆయన టిడిపి లేదా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారని సోషల్ మీడియాలో గుప్పుమనగానే అధిష్టానం ఆదేశం మేరకు మంత్రి అంబటి రాంబాబు శనివారం రాత్రి గుంటూరులో ఆయన ఇంటికి వెళ్ళి బుజ్జగించేందుకు ప్రయత్నించారు.
కానీ కాంగ్రెస్ తలుపులు బార్లా తెరిచి అందరినీ ఆహ్వానిస్తున్నప్పుడు వెళ్ళి చేరిపోతే టికెట్తో పాటు స్వేచ్చ, గౌరవం రెండూ లభిస్తాయి కదా? అని ఆయన అనుచరులు చెపుతున్నట్లు తెలుస్తోంది. కనుక బుజ్జగింపులు ఫలించాయా లేదా అనేది నేడో రేపో తెలుస్తుంది.




