‘వైసీపి ప్రకటిస్తున్న జాబితాలలో అభ్యర్ధులే ఫైనల్’ అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చినప్పటికీ ఆయన మాట, నమ్మకం రెండూ నిలబెట్టుకోవడం లేదు. జాబితాలలో అభ్యర్ధులు మారుతూనే ఉన్నారు.
అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుని మచిలీపట్నం తీసుకువచ్చి ఆయన చేతిలో బలవంతంగా బందరు లడ్డూ (ఎంపీ) పెట్టారు. అదే సమయంలో డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ని అవనిగడ్డ శాసనసభ అభ్యర్ధిగా ఖరారు చేశారు.
వైసీపి సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి పార్టీని వీడి టిడిపిలో చేరినందున ఈసారి ఆయన మచిలీపట్నం నుంచి టిడిపి, జనసేనల ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేసే అవకాశం ఉంది. ఈ పొత్తుల కారణంగా మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గంలో కాపు ఓటర్లందరూ టిడిపి, జనసేనలవైపు మొగ్గు చూపే అవకాశం కూడా ఉంది.
దీంతో వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎంపీ అభ్యర్ధిని మార్చేశారు. డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ని తాడేపల్లి ప్యాలస్కు పిలిపించుకొని నచ్చజెప్పి బందరు లడ్డూ ఆయన చేతిలో పెట్టి మచిలీపట్నం పంపించారు.
ఈ ఓటమి భయంతోనే ఎన్నికల బరిలో నుంచి తప్పుకొన్న ఎమ్మెల్యే పేర్ని నాని, తన కొడుకు పేర్ని కిట్టుని ఈసారి రాజకీయ ఆరంగ్రేటం చేయిస్తున్నారు. కిట్టూ తొలిసారి పోటీ చేస్తున్నాడు కనుక ఎన్నికలలో ఓడిపోయినా తన పరువుకి భంగం కలగదని పేర్ని నాని భావించి ఉండవచ్చు.
తన జాగ్రత్తలో తాను ఉన్న పేర్ని నాని, గురువారం మచిలీపట్నంలోని పార్టీ కార్యాలయంలో ప్రెస్మీట్ పెట్టి, మచిలీపట్నం లోక్సభ అభ్యర్ధిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ పోటీ చేస్తారని ప్రకటించడం విశేషం.
ఆయన అయిష్టంగానే బందరు లడ్డూ చేతిలోకి తీసుకున్నారు కనుక తింటారో లేదా పారేసి పోతారో… లేదా టిడిపి, జనసేనల చేతిలో పెట్టి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటారో చూడాలి.




