ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు ప్రకటిస్తున్న అనేక స్కీంలు విపక్షాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పెన్షన్లు, డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ బాగా పని చేస్తున్నాయి అని వార్తలు అందుతున్నాయి. అయితే మహిళలకు ఒకేసారి 10000 ఇవ్వడం కష్టం కనుక ఎన్నికల లోపు మూడు విడతలుగా ఇస్తామని పోస్టు డేటెడ్ చెక్కులు ఇస్తుంది ప్రభుత్వం. కోడ్ వస్తే ఇవ్వలేరు కాబట్టి ముందే ఆలా చెక్కులు ఇస్తే ఇబ్బంది ఉండదని ప్రభుత్వం అంచనా.
అయితే ఈ చెక్కులు ఇచ్చిన విషయం ఇప్పుడు ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్లింది. కేంద్ర ఎన్నికల ముఖ్య కమిషనర్ సునీల్ అరోరా విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ తమకు దీనిపై కొన్ని పార్టీలు పిర్యాదు చేశాయని విచారణ జరుపుతున్నామని ప్రకటించారు అయితే ప్రభుత్వం మాత్రం ఇదేమీ కొత్త పద్దతి కాదని, 2015 నుంచి వీటిని ఇస్తున్నామని ప్రభుత్వం వివరణ ఇచ్చిందని, దానిపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఏం జరగబోతుందో చూడాలి.
మరోవైపు డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పేరుతో ఇస్తున్న డబ్బును కూడా ఆపాలని వైఎస్సాఆర్ కాంగ్రెస్ చూస్తుందని, మహిళలు బాగుపడితే వారు చూడలేకపోతున్నారని ఆరోపిస్తూ పల్లెలలో ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ ఎన్నికల కమిషన్ ఈ చెక్కులను గనుక ఆపేస్తే అది ప్రతిపక్షం మీదకు వెళ్లేలా పావులు కదుపుతున్నారు. ఈ రకంగా చెక్కుల పంపిణీ జరిగినా, ఎన్నికల కమిషన్ వల్ల ఆగిపోయినా అది వైఎస్సాఆర్ కాంగ్రెస్ కు నష్టం చేకూరే అవకాశం ఉంది.



